కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే..రైతుబంధును రూ.15 వేలకు పెంచుతం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే..రైతుబంధును రూ.15 వేలకు పెంచుతం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  •     మండలానికో 50 బెడ్స్ హాస్పిటల్​ఏర్పాటు చేస్తాం
  •     మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి హామీ

సత్తుపల్లి, వెలుగు : రాష్ట్రంలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​లీడర్​కొండూరి సుధాకర్​8 రోజులుగా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ముగింపు సందర్భంగా గురువారం సత్తుపల్లి బస్టాండ్ రింగ్ సెంటర్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయతో కాదని, సోనియా గాంధీ అనుగ్రహంతో అని చెప్పారు. 10 ఏండ్లుగా మాయమాటలతో ఏ పథకాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ లోన్లు, గృహలక్ష్మి పేరుతో కల్వకుంట్ల కుటుంబం ప్రజలను మోసం చేస్తోందన్నారు.

ఇన్నాళ్లు ఏం గడ్డి పీకారో చెప్పాలని ధ్వజమెత్తారు. కొన్నిరోజుల్లో బీఆర్ఎస్​ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అన్నారు.డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని, సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గెలువడం తథ్యం అని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో సత్తుపల్లిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ ఏర్పాటు చేస్తామని, బొగ్గు గనుల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రిస్తామని, స్థానిక గనుల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. బ్లాస్టింగ్ తో దెబ్బతిన్న ఇళ్లను తిరిగి నిర్మిస్తామని తెలిపారు.

ALSO READ: ఈ-సిగరెట్​తో ఇక్కట్లే! : తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి

మండలానికి ఒక 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, కార్పొరేట్ స్థాయి స్కూల్​ను డెవలప్​చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ అధికార మదంతో ఊగిపోతున్నాడని మండిపడ్డారు. కొడూరి సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్​గెలుపుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మువ్వా విజయబాబు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తోట సుజల రాణి గణేశ్, కౌన్సిలర్లు రాంబాబు, జ్యోతి రవీందర్ రెడ్డి, గ్రాండ్ మౌలాలి, ఉడతనేని అప్పారావు, సర్పంచ్ ముత్తారెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.