బీఆర్ఎస్ విధానాల వల్లే రాష్ట్రంలో నీటి కొరత: మంత్రి పొంగులేటి

 బీఆర్ఎస్ విధానాల వల్లే రాష్ట్రంలో నీటి కొరత: మంత్రి పొంగులేటి

ఖమ్మం: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నీటి కొరతకు అప్పటి బీఆర్ఎస్ పాలకుల విధానాలే కారణమని మండిపడ్డారు. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం ఖమ్మం జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరానియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఎంతటి పెద్దవారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. తప్పు చేసిన వారు ఊచలు లెక్కపెట్టడం ఖాయమన్నారు.  విద్యుత్తు కొనుగోలులో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు.  ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.

 దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పదవిని వదిలేసిన మహానేత రాహుల్ గాంధీ అని పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో  పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.  ఖమ్మం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించవలసిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుందని మంత్రి పొంగులేటి విమర్శించారు.