కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి బుద్ది తెచ్చుకోండి.. పొన్నం ప్రభాకర్ ఫైర్

కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి బుద్ది తెచ్చుకోండి.. పొన్నం ప్రభాకర్ ఫైర్

కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి బీజేపీ నాయకులు బుద్ది తెచ్చుకోవాలి, మత రాజకీయం మానేయాలని హితవు పలికారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కర్ణాటకలో కాంగ్రెప్ గెలుపు సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాముడు, హనుమంతుడు దేవుడి పేర్లు చెప్పుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. బీజేపీ మతపరమైన అంశాలే తప్ప వేరే అంశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారాయన. హిందుత్వం పేరుతో బీజేపీ నాయకులు దేవుళ్ళను వాడుకుంటున్నారని ఆరోపించారు పొన్నం.

బండి సంజయ్ మతం పేరుతో రాజకీయం చేయడం సరికాదని పొన్నం ప్రభాకర్ సూచించారు. బండి సంజయ్ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాడా.. ప్రజల సమస్యలను ఏమైనా పట్టించుకున్నాడ అని ప్రశ్నించారు.  జూనియర్ పంచాయితి కార్యదర్శులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బోయినిపల్లి వినోద్ కుమార్ ఎంపీగా పని చేసిన సమయంలో సిరిసిల్లకు ఏం చేశారు.. చేనేత కార్మికులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు పొన్నం ప్రభాకర్.