ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణమురళి

 ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణమురళి

అమరావతి: సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని.. అపాయింట్ మెంట్.. ఇతర నియమ నిబంధనల వివరాలు ప్రత్యేకంగా వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సినిమా కథ, మాటల రచయితగా చలనచిత్ర రంగంలో కెరీర్ మొదలుపెట్టిన పోసాని కృష్ణమురళి నటుడిగా, దర్శకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఏపీ రాజకీయాల్లో వైసీపీకి మద్దతు ప్రకటించి గత ఎన్నికల సమయంలో ప్రచారం కూడా నిర్వహించిన పోసానికి ఎట్టకేలకు ప్రభుత్వం పదవిని కట్టబెట్టింది. 

నిన్న అలీకి.. ఇవాళ పోసానికి

టాలీవుడ్ పరిశ్రమకు చెందిన వారికి పదవులు కట్టబెట్టడంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం హాస్య నటుడు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించిన ప్రభుత్వం ఇవాళ పోసాని కృష్ణమురళికి కూడా పదవి కట్టబెట్టింది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయానికి పనిచేసిన అలీ, పోసానిలకు ఎట్టకేలకు బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు క్యాడర్ కు ఇప్పటి నుంచే సన్నద్ధం చేసే చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.