సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దు : పోతుగంటి లక్ష్మణ్

సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దు :  పోతుగంటి లక్ష్మణ్

ములకలపల్లి, వెలుగు : సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు పోతుగంటి లక్ష్మణ్  కోరారు. మంగళవారం తోగూడెంలో వలస ఆదివాసీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్​గఢ్​ నుంచి  ఆదివాసీలు ఈ ప్రాంతానికి వలస వచ్చి 30 ఏండ్లు దాటుతుందన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నందున వారికి అటవీ హక్కుల హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఇప్పటికీ అటవీ అధికారులు వారి భూములలో ప్లాంటేషన్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని, అలాంటి చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆదివాసి జీవన విధానం నాయకులు క్రాంతి, సోయం బాపూరావు, తాటి రవి, ఎర్రగోళ్ల రామారావు పాల్గొన్నారు.