హైదరాబాద్: పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి కోసం 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను ఈ నెల 23 నుండి నవంబర్ 25 వరకు మాదాపూర్లోని హైటెక్స్లో నిర్వహిస్తున్నామని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) సోమవారం తెలిపింది. ఈ కార్యక్రమంలో 99 మంది గ్లోబల్ ఎక్స్పర్టులతోపాటు దాదాపు 370 కంపెనీలు పాల్గొంటాయని, దక్షిణాసియాలో అతిపెద్ద పౌల్ట్రీ కార్యక్రమం ఇదేనని ప్రకటించింది. మెగా పౌల్ట్రీ ఈవెంట్లో భాగంగా మంగళవారం ఈ సెక్టార్పై నాలెడ్జ్ సెషన్ ఏర్పాటు చేస్తుండగా, బుధవారం నుండి మూడు రోజుల మెగా పౌల్ట్రీ ఎక్స్పోను నిర్వహించనున్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై టెక్నికల్ సెమినార్ దృష్టి సారిస్తుంది. భారతదేశం, ఆఫ్రికా, యూరప్, అమెరికా సార్క్ దేశాల నుండి 1,200 మందికి పైగా ప్రతినిధులు వస్తారు. కోళ్లలో సంతానోత్పత్తి, పరిశుభ్రత, పోషకాహారం, జంతువుల ఆరోగ్యం, పౌల్ట్రీ పరికరాలు, మార్కెటింగ్లో సరికొత్త టెక్నాలజీలపై మాట్లాడుతారు. ఈ సందర్భంగా ఐపీఈఎంఏ అధ్యక్షుడు చక్రధరరావు మాట్లాడుతూ “ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మాంసం, గుడ్ల ఉత్పత్తిని కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం మాకు సహకారం అందిస్తోంది.
మనదేశంలో ప్రోటీన్ లోపం పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి పౌల్ట్రీ రంగం ఎంతో దోహదపడుతుంది. ఇది లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలోని మహిళలకు ఉపాధిని కూడా సృష్టిస్తుంది. పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మనదేశంలో చికెన్, గుడ్ల వాడకం చాలా తక్కువగా ఉంది” అని ఆయన అన్నారు. ఐపీఈఎంఏ డైరెక్టర్ అనిల్ ధుమాల్ మాట్లాడుతూ ఫామ్ల నిర్వహణ, జంతువుల ఆరోగ్యం, పోషకాహారం, పెంపకం, పౌల్ట్రీ ఫామ్ పరికరాలు, ఫీడ్ తయారీ పౌల్ట్రీ ఉత్పత్తిలో కొత్త టెక్నాలజీల గురించి రైతులకు తెలియజేయడం పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ హైదరాబాద్ జోనల్ చైర్మన్ జి.చంద్రశేఖర్రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘చికెన్ ఉత్పత్తిలో మనది ప్రపంచంలోనే నాలుగోస్థానం. వాడకం మాత్రం తక్కువగా ఉంది. ఒక మనిషి ఏటా కనీసం 180 గుడ్లను తినాలి. మనదేశంలో 90 గుడ్లను కూడా తినడం లేదు. కనీసం తొమ్మిది కేజీల చికెన్ తినాలి. మన దగ్గర తలసరి వాడకం 4.5 కేజీలు మించడం లేదు. మా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దాణాతోపాటు ఇతర వస్తువుల రేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగింది. ప్రతి గుడ్డుకు 50 పైసల నష్టం వస్తోంది. కోళ్ల పెంపకంలోనూ భారీ నష్టాలను భరిస్తున్నాం. మా పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇస్తే చాలా సబ్సిడీలు దక్కుతాయి”అని ఐపీఈఎంఏ సభ్యులు వివరించారు.