హైదరాబాద్, వెలుగు: చత్తీస్గఢ్ పవర్ మన రాష్ట్ర డిస్కంలకు మరో షాక్ ఇచ్చింది. దాన్ని ఎక్కువ రేటుకు కొనడంతోపాటు, రాష్ట్రానికి తెచ్చుకునేందుకు చేసిన హడావుడి కొంప ముంచింది. విద్యుత్ (లైన్) కారిడార్ కోసం ఆగమాగం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు డిస్కంల మెడకు చుట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యల కారణంగా పవర్గ్రిడ్ కార్పొరేషన్కు రూ. 261 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కరెంటు కోతల సమస్య నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఎక్కడపడితే అక్కడ ఎడాపెడా పవర్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా చత్తీస్గఢ్లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. తెలంగాణ, చత్తీస్గఢ్ సీఎంల మధ్య ఎంవోయూ జరిగింది. చత్తీస్గఢ్ నుంచి మరో 1,000 మెగావాట్లను కొనుగోలు చేస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అప్పటివరకు చత్తీస్గఢ్ పవర్ రాష్ట్రానికి వచ్చే మార్గం లేదు. రెండు రాష్ట్రాలను లింక్ చేసే విద్యుత్ కారిడార్ లేదు. ఆ టైంలో ఈస్టర్న్, నార్తర్న్, సదరన్ రీజియన్కు లింక్చేసే వార్ధా–నిజామాబాద్ 765 కేవీ డబుల్ సర్క్యూట్ పవర్ ట్రాన్సిమిషన్ లైన్ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. ఈ కారిడార్ కెపాసిటీ 4,200 మెగావాట్లు. అందులో వెయ్యి మెగావాట్ల కారిడార్ తెలంగాణ అడ్వాన్సుగా బుక్ చేసుకుంది. చత్తీస్గఢ్ నుంచి మరో 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు మరో వెయ్యి మెగావాట్ల కారిడార్ను ఆ తర్వాతి కాలంలో బుక్ చేసుకుంది. 2017 మార్చి చివర్లో కారిడార్నిర్మాణం పూర్తయింది. అప్పట్నుంచీ ఈ కారిడార్ను వినియోగించుకొని చత్తీస్గఢ్ పవర్ను తెలంగాణకు తెచ్చుకునే లైన్ క్లియరైంది. తొలి ఎంవోయూ మేరకు 1,000 మెగావాట్ల విద్యుత్ కోటాలో కొంత మొత్తాన్ని అవసరమైనప్పుడు డిస్కం వినియోగించుకుంటోంది. రెండో విడత వెయ్యి మెగావాట్ల పవర్ వాడుకునేందుకు అడ్వాన్స్గానే పవర్ గ్రిడ్ కారిడార్ ను బుక్ చేసుకుంది. ఇప్పటికీ అందులో ఒక్క వాట్ విద్యుత్ను కూడా వాడుకోలేదు. ఒప్పందం ప్రకారం ఆ రెండో వెయ్యి మెగావాట్ల లైన్లను 2018 ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవాలి. కానీ ఇప్పటికీ ఒక్క యూనిట్కూడా ఈ లైన్ల ద్వారా తెచ్చుకోలేదు. ఇది తమకు అవసరం లేదని, ఈ కారిడార్ను వదులుకుంటామని అదే ఏడాది ఫిబ్రవరి 19న పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు డిస్కంలు లెటర్ రాశాయి. కానీ ఒకసారి లైన్లను బుక్ చేసుకున్న తర్వాత.. వదులుకుంటే నిర్మాణానికి రూ. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన పవర్ గ్రిడ్ నష్టపోతుంది.
ఈ నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని పవర్ గ్రిడ్ ఒప్పందంలో ఉంది. దీంతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి తమకు రూ. 261 కోట్ల పరిహారం రావాలని పవర్ గ్రిడ్ లెక్కగట్టింది. మొత్తం12 ఏండ్ల కాలానికి సంబంధించిన 66 శాతం ట్రాన్స్మిషన్ చార్జీలు, నోటీసు చార్జీలు ఇందులో ఉన్నాయి. తొందరపాటుతో విద్యుత్ కారిడార్లను బుక్ చేసినందుకు డిస్కంలు ఈ భారీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఒప్పందం ప్రకారం తమకు చార్జీలు చెల్లించాలని పవర్ గ్రిడ్ ఇప్పటికే డిస్కంలకు నోటీసులు ఇచ్చింది. అందులో రూ. 261 కోట్లు తమకు పరిహారంగా రావాలని లెక్క తేల్చింది. దీంతో సదరన్ డిస్కంకు పవర్ గ్రిడ్ ఇచ్చిన నోటీసుల షాక్ తగిలినట్లయింది. తొందరపాటుతో కారిడార్ను అడ్వాన్స్గా బుక్ చేసుకోవటంతో కోట్లల్లో పెనాల్టీ చెల్లించాల్సి రావటం అదనంగా భారంగా మారినట్లయింది. అక్కరలేని కారిడార్కు భారీగా డిస్కంలు మూల్యం చెల్లించినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ కరెంటు చార్జీల రూపంలో ఈ పెనాల్టీని మళ్లీ జనంపై రుద్ది.. చార్జీల భారం మోపుతారనే వాదనలు వినిపిస్తున్నాయి.