పవర్ పాయిజనే..కానీ దాన్నొదిలి పోలేం: రాహుల్

పవర్ పాయిజనే..కానీ దాన్నొదిలి పోలేం: రాహుల్

లోక్​సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ, అధికార బీజేపీతో హోరాహోరీగా తలపడ్డ కాంగ్రెస్ చీఫ్​ రాహుల్​ గాంధీ.. ఫలితాలపై మాత్రం  తనకెలాంటి అంచనాలు లేవన్నారు. కాంగ్రెస్​ గెలుస్తుందనో, తాను ప్రధానమంత్రి అవుతాననో మే 23 కంటే ముందే చెబితే, అది ప్రజాతీర్పును అవమానించినట్లవుతుందన్నారు. ‘ఔట్​లుక్​’ మ్యాగజైన్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్​, ‘‘అధికారం విషం లాంటిది, కానీ దాన్నుంచి దూరంగా పోలేం’’అని మరోసారి చెప్పుకొచ్చారు. 2013లో కాంగ్రెస్​ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన టైమ్​లో తొలిసారి ‘పవర్​ ఈజ్​ పాయిజన్’ అని కామెంట్​ చేయడాన్ని గుర్తుచేస్తూ, ఇన్నేండ్ల తర్వాత కూడా తన దృక్పథంలో మార్పురాలేదన్నారు.

‘‘బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమయ్యామంటే ఒప్పుకోను. కాంగ్రెస్​ పోరాటం వల్లే ఈ ఎన్నికల్లో నిరుద్యోగం, రైతుల బాధలు, రాఫెల్​ సహా ఇతర స్కాంలు కీలక అంశాలయ్యాయి. మా వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించాం. ఎవరు ఎక్కడ ఉండాలనేది ప్రజలే డిసైడ్​ చేశారు. మే 23న ప్రజాతీర్పు రానుంది. యూపీ, ఢిల్లీలో పొత్తులు పెట్టుకుని ఉంటే ఇంకా ఎఫెక్టివ్​గా ఉండేదన్నది నిజం. పొత్తులు  లేని చోట్ల, మేం గెలవడానికి అవకాశమున్న స్థానాల్లో గట్టిగా ఫైట్​ చేశాం. చాన్స్​ తక్కువగా ఉన్న సీట్లలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్లాం. మేం అనుసరించిన స్ట్రాటజీ ప్రకారమైతే యూపీలో బీజేపీకి 10 సీట్లు దాటవు. ఢిల్లీలో కనీసం నాలుగు సీట్లు గెలుస్తామనుకుంటున్నా. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్​కు స్పష్టత ఉంది. మిగతా ప్రతిపక్ష పార్టీలను కలుపుకుపోవడానికి, ఆక్రమంలో కొన్ని త్యాగాలు చేయడానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం”అని రాహుల్​ చెప్పారు. జాతీయ మీడియా తరచూ వాడే ‘ప్రాంతీయ పార్టీ నాయకులు’ అనేది సరైన పదం కాదని కాంగ్రెస్ చీఫ్​ అన్నారు. మాయావతి, అఖిలేశ్ యాదవ్​, చంద్రబాబు, నవీన్​ పట్నాయక్​, ఎంకే స్టాలిన్​, మమతా బెనర్జీ తదితరులు రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారని, వాళ్లను దేశానికి ప్రతినిధులుగానే చూడాలని రాహుల్‌ గాంధీ అన్నారు.

నాన్న మరణం వెంటాడింది

కార్యకర్తల కోరిక మేరకే ప్రియాంక గాంధీ పార్టీ పదవిని చేపట్టారన్న రాహుల్.. వారసత్వ రాజకీయాలపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయానని అనను కానీ, ‘గాంధీ–నెహ్రూ’ వారసుడిగా ఉండటం వల్ల ప్రయోజనాలు ఎన్నున్నాయో, నష్టాలు కూడా అంతే ఉంటాయని చెప్పగలను. ఇక్కడో విషయం గమనించాలి. కేవలం రాహుల్​ ‘గాంధీ’ని అయినందుకు మాత్రమే ప్రత్యర్థులు నన్ను టార్గెట్​ చేశారనుకోను. వ్యక్తిగా మనుగడ వాళ్లను భయపెడుతున్నది కాబట్టే, బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ నాపై విమర్శలు చేస్తాయి. అయితే వ్యక్తిగత విమర్శల్ని ఇప్పుడు లైట్​​ తీసుకోగలుతున్నాను. నాన్న(రాజీవ్​ గాంధీ) మరణం నాలో కోపం రగిల్చింది. చాలా కాలం పాటు కోపిష్టిలా ఉండిపోయా. వన్​ ఫైన్​ డే, నాలో రియలైజేషన్​ వచ్చింది. కోపాన్ని మోయాల్సిన అవసరం లేదనిపించింది. కొన్ని భారాల్ని వదిలించుకుంటేనే జీవితంలో ముందుకువెళ్లగలం. ఇప్పుడు నన్ను ఎవరేమన్నా అస్సలు కోపం రాదు. ప్రజలు చెప్పేది శ్రద్ధగావినే, వాళ్లవైపు నుంచి ఆలోచించగలిగినవారే నిజమైన నాయకులని నేను నమ్ముతా. దేశప్రజలకు సంతోషాన్ని పంచడమే నా ధ్యేయం. ప్రేమ లేకుంటే ఇది సాధ్యం కాదు”అని రాహుల్​ గాంధీ చెప్పుకొచ్చారు.