టాయిలెట్ వాటర్ తో కరెంట్...అగ్గువకే అగ్రికల్చర్ డ్రోన్..అబ్బురపరిచిన ఆరు రాష్ట్రాల స్టూడెంట్స్

టాయిలెట్ వాటర్ తో  కరెంట్...అగ్గువకే అగ్రికల్చర్ డ్రోన్..అబ్బురపరిచిన ఆరు రాష్ట్రాల స్టూడెంట్స్
  • సౌత్​ ఇండియా సైన్స్ ఫెయిర్​లో ఆకట్టుకున్న ఎగ్జిబిట్స్​
  • రెండో రోజు ఫెయిర్​కు వేలాది మంది
  • ఈ నెల 23 వరకు కొల్లూర్​ గాడియం స్కూల్​లో వైజ్ఞానిక ప్రదర్శన

అతి తక్కువ ఖర్చుతో వ్యవసాయ రంగంలో ఉపయోగించే డ్రోన్​ను తయారు చేశాడు పాండిచ్చేరికి చెందిన టీచర్​ వీరమణి ఖండన్. తక్కువ బరువు, ఎక్కువ దృఢంగా ఉండే విండ్ బ్లేడ్​ ఉపయోగించి ట్రాన్స్ మీటర్​ రిసీవర్​ సహకారంతో మోటార్లకు కనెక్ట్ చేసే పద్ధతిని ఆయన కనుగొన్నారు. 

హై టార్క్​ రిలీజ్ చేసేలా 5200 ఎంఏహెచ్​ బ్యాటరీలను రొటేషన్​ సిస్టమ్​ ద్వారా కనెక్ట్ చేసి డ్రోన్​ ఎగిరేలా చేశాడు. ఇందులో ఆలో పైలట్​ విధానం కూడా ఉందని నిర్దేశిత పొలం, ఏరియాను, పంటను సెలెక్ట్​ చేసి రైతులు ఎక్కడి నుంచైనా ఈ డ్రోన్​ను యాప్ ద్వారా ఆపరేట్​ చేయవచ్చని  వివరించారు.

వృథాగా పోయే టాయిలెట్ వాటర్​ నుంచి కరెంట్ తయారు చేసే పద్దతిని తమిళనాడుకు చెందిన ధానుశ్రీ అనే స్టూడెంట్​  ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. యూరిన్​ పవర్​ జనరేషన్​ సిస్టమ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిట్ ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. 

ప్రత్యేకంగా అమర్చిన యూరినల్​ టబ్స్​కి కాపర్​, అల్యూమినియం ఎలక్ర్టోడ్స్​తో రియాక్షన్​ జరిపించి పవర్​ జనరేట్​ చేసే టెక్నాలజీని ధానుశ్రీ ప్రదర్శించింది. కరెంట్ ప్రొడక్షన్​ తరువాత అదే నీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి, గార్డెనింగ్, నిర్మాణ పనులకు వినియోగించవచ్చని  వివరించింది. 

రామచంద్రాపురం, వెలుగు: వృథాగా పోయే టాయిలెట్​ వాటర్​ నుంచి కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే.. వెయ్యి, రెండు వేల ఖర్చుతో అగ్రికల్చర్​ డ్రోన్ తయారు చేయగలిగితే.. ​స్మోక్​ అండ్ హీట్ సెన్సర్​ తో బస్సుల్లో ఫైర్​ యాక్సిడెంట్లు నివారించగలిగితే.. ఇలా మరెన్నో ఆలోచనలకు విద్యార్థులు ఆచరణ రూపమిచ్చారు.  

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్​ గాడియం ఇంటర్నేషనల్​ స్కూల్​లో సోమవారం ప్రారంభమైన   సౌత్​ ఇండియా సైన్స్ ఫెయిర్​లో ప్రదర్శనకు ఉంచిన ఎగ్జిబిట్స్​సందర్శకులను ఆకట్టుకున్నాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన  విద్యార్ధులు 223 ఎగ్జిబిట్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.  

ఇందులో 55 గ్రూపు ప్రాజెక్టులు కాగా,  85 వ్యక్తిగత, 59 టీచర్స్ ఎగ్జిబిట్స్, మరో 24  ఎన్​జీవోలకు సంబంధించినవి ఉన్నాయి.   సోమవారం ఫెయిర్​ అట్టహాసంగా ప్రారంభం కాగా,  మంగళవారం వివిధ జిల్లాల నుంచి స్టూడెంట్లు  ఫెయర్​చూసేందుకు తరలివస్తున్నారు. 

రోజుకు 4 వేల మంది విద్యార్థులు తిలకించేందుకు వీలుగా అధికారులు  ఏర్పాట్లు చేశారు.  ఈనెల 23 వరకు ప్రదర్శన కొనసాగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 

కర్నూలు బస్​ ప్రమాదంతో చలించి.. 

ఇటీవల కర్నూల్​లో జరిగిన​ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో చలించిన ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన విద్యార్ధులు అలాంటి ప్రమాదాల నివారణకు  మార్గాన్ని కనుగొన్నారు. జడ్పీహెచ్​ఎస్​లో తొమ్మిదో తరగతి చదువుతున్న గాయత్రి, శరణ్య స్మోక్​ అండ్ హీట్ సెన్సర్​ పరికాన్ని కనిపెట్టారు. 

బస్సుల్లో, కార్లలో ఈ సెన్సర్​ అమర్చితే  ప్రమాదాలు జరిగినప్పుడు అలారంతోపాటు ఎమర్జన్సీ డోర్లు  తెరుచుకుంటాయని ప్రయోగాత్మకంగా వివరించారు. 

 ఈజీగా స్పేస్​ వ్యర్థాల సేకరణ 

అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాలను సులభంగా ఎలా సేకరించవచ్చో తెలంగాణకు చెందిన స్టూడెంట్​ ప్రదర్శించాడు. మెదక్​ సిద్ధార్ధ రూరల్​ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న అక్షయ్ ఎలక్ర్టో మ్యాగ్నటిక్​ పద్ధతి ద్వారా​ స్పేస్​ డెబ్రీస్​ను  సేకరించే విధానాన్ని   ప్రదర్శించాడు.  

నాసా లాంటి సంస్థలు పెద్ద సైజు వ్యర్ధాలను మాత్రమే తొలగించే టెక్నాలజీ కలిగిఉందని,  కానీ అంతరిక్షంలో ఉన్న ఎన్నో మెట్రిక్​ టన్నుల సూక్ష్మ వ్యర్ధాలను తాను కనిపెట్టిన పద్ధతి ద్వారా క్లీన్​ చేయొచ్చని అక్షయ్​ వివరించాడు. అలాగే వాటిని సముద్రంలో డిస్పోస్​ చేసే విధంగా ఓ సిస్టమ్ డెవలప్​ చేసినట్లు తెలిపాడు. 


 స్మార్ట్​ ఇంటెలిజెన్స్​ ఫార్మింగ్ సిస్టమ్

 భవిష్యత్తులో సంప్రదాయ వ్యవసాయం స్థానంలో  కొత్త పద్దతులు  అవసరమని పుదుచ్చేరికి చెందిన విద్యార్ధులు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు.  స్టూడెంట్స్ జాహ్నవి, సాధిక​ సోలార్​, విండ్​ ఎనర్జీలను ఉపయోగించి కొత్త తరహా వ్యవసాయం ఎలా చేయొచ్చో  చూపించారు. ఏరో బాండింగ్ న్యూట్రియన్స్​ వాటర్​ను ఉపయోగించి ఫోటో సింథసిస్, ఆర్టిఫిషియల్​ హీట్ సిస్టమ్​ లాంటి పద్దతులతో తక్కువ నీటిని ఉపయోగించి లాభసాటి వ్యవసాయం చేయడం,  వ్యవసాయ క్షేత్రాలను, పంటలను, ఆక్వా కల్చర్​ను జంతువుల నుంచి కాపాడుకునే పద్దతులను  ప్రదర్శించారు.