ఇంద్రవెల్లి, వెలుగు : ఆదిలాబాద్జిల్లా కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి నాగోబాను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భాగంగా ఉదయం గోవాడ్లో మెస్రం వంశీయుల కొత్త కోడళ్లు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ప్రత్యేక జొన్న గట్కలను తయారు చేసుకుని, 22 కితల వారీగా ఒకరినొకరు పంచుకొని సహపంక్తి భోజనాలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం సోయంగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు మెస్రం రాము.. నాగోబా జాతర చరిత్రపై గీసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మంత్రి సీతక్కతో పాటు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ నాగోబాను దర్శించుకున్నారు. జాతరలో భాగంగా బుధవారం మెస్రం వంశీయులు పేర్సపేన్, బాన్పేన్ పూజలను నిర్వహించనున్నారు.
