గుజరాత్ లో బిపర్ జాయ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. కచ్ కోట్, లఖ్ పత్ సమీపంలో తీరం దాటింది. భారీ వర్షంతో పాటు గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. 22 మందికి గాయాలైనట్లు తెలిపారు అధికారులు. పలు ప్రాంతాల్లో 524 చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో రెడ్ ,ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
కోస్టల్ ఏరియాకు 10 కి. మీ దూరంలో గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. రోడ్లపై విరిగిపడ్డ చెట్లను తొలగిస్తున్నారు. కరెంట్ స్తంభాలను పునరుద్ధరిస్తున్నారు. తీర ప్రాంతాల వాసులను షెల్టర్లకు తరలిస్తున్నారు.
భావ్నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నంలో పశువుల పెంపకందారుడు, అతని కుమారుడు మరణించినట్లు సమాచారం. తుఫాను వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.