- అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలకు కూడా..
- కలెక్టర్ల అధికారాల్లో కొన్ని బదలాయించాలని భావిస్తున్న ధరణి కమిటీ
- భూసమస్యల పరిష్కారానికి భూభారతి తరహా కార్యక్రమాలపై చర్చ
- ఐదు జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశం
- ధరణి సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని కలెక్టర్ల సూచన
హైదరాబాద్, వెలుగు: ధరణిలో కలెక్టర్లకు ఉన్న అధికారాలను బదలాయించాలని ధరణి కమిటీ భావిస్తున్నది. అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ), ఆర్డీఓలు, ఎమ్మార్వోలకు కొన్ని అధికారాలు ఇవ్వాలని అనుకుంటున్నది. సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలోని ధరణి కమిటీ బుధవారం సెక్రటేరియెట్ లో నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా ధరణిలో ఉన్న ఇబ్బందులపై వాళ్లను అడిగి తెలుసుకుంది.
సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈసారి ధరణి సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు కూడా హాజరుకాగా, దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ధరణిలో అన్నింటికీ కలెక్టర్కే అధికారం ఉండడంతో, అది పెద్ద సమస్యగా మారిందని 5 జిల్లాల కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. కలెక్టర్కు ఉన్న అధికారాల్లో కొన్నింటిని అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ), ఆర్డీఓలు, ఎమ్మార్వోలకు ఇవ్వాలని సూచించారు. ఫలితంగా దరఖాస్తుల పరిష్కారం త్వరగా అవుతుందని పేర్కొన్నారు. ధరణి సాఫ్ట్వేర్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని.. రైతులకు, అధికారులకు అర్థమయ్యేలా సులువుగా సమస్యలకు పరిష్కారం లభించేలా మాడ్యూల్స్ను అప్డేట్ చేయాలని కోరారు.
కలెక్టర్లపై పని భారం..
కలెక్టర్లు, ఇతర అధికారులపై పనిఒత్తిడి, వచ్చిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి యంత్రాంగం లేకపోవడం, సాఫ్ట్వేర్లో పొందుపరిచిన మాడ్యూల్స్ సరిగ్గా లేకపోవడం ప్రధాన ఇబ్బందులని ధరణి కమి టీకి కలెక్టర్లు వివరించారు. ధరణిలో రైతులు ఏ చిన్న సమస్య కోసం దరఖాస్తు చేసినా, అది నేరుగా కలెక్టర్ లాగిన్లోకే వెళ్తుంది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చేవాళ్లు లేరు. కలెక్టర్కు ఒక్క ధరణి పనులే కాకుండా జిల్లా పరిపాలనకు సంబంధించి అనేక పనులు ఉంటాయి. దీంతో ధరణి దరఖాస్తులపై వాళ్లు దృష్టిపెట్టలేకపోతున్నారు. దీంతో ధరణిలో వచ్చిన దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్లో ఉంటున్నాయి. భూసమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి గతంలోలాగా వీఆర్వోలు, వీఆర్ఏలు లేరు. ఒక్క రెవె న్యూ ఇన్స్పెక్టర్ మీదనే ఆధారపడాల్సి వస్తున్నది. సద రు ఆర్ఐ ఆ మండలంలో వచ్చిన దరఖాస్తులన్నింటికీ నోటీస్లు ఇచ్చి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అయితే తగిన సిబ్బంది లేక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎమ్మార్వోనే అన్నీ తయారు చేయాల్సి వస్తున్నది. అందులో భాగంగా ఎమ్మార్వో, ఆర్డీఓ, అడిషనల్కలెక్టర్లకు కొన్ని మాడ్యుల్స్కు ధరణిలో అధికారం ఇస్తే సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించేందుకు అవకాశం ఉంటుందని నిర్ణయానికి వచ్చారు.
భూ భారతిపై చర్చ..
నిజామాబాద్ జిల్లాలో గతంలో చేసిన భూభారతి పైల ట్ప్రాజెక్టుపైనా ధరణి కమిటీ చర్చించింది. ఈ ప్రాజెక్టు సగంలోనే ఆగిపోయింది. అయితే అప్పటికే వివిధ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇచ్చినట్టు కమిటీ గుర్తించింది. గ్రామాల్లో భూభారతి మాదిరి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించేందుకు అవకాశం ఉంటుందనే భావనకు కమిటీ వచ్చింది. ఇదిలా ఉంటే భూములకు సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న వివిధ శాఖలతోనూ సమావేశం కావా లని కమిటీ నిర్ణయించింది. శనివారం అటవీ, గిరిజన, వ్యవసాయ శాఖలతో సమావేశం కానుంది. ఆ తర్వాత గ్రామాల్లో పర్యటించాలనే నిర్ణయానికి వచ్చింది.