
- కీలక ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు
- మూడో సారి 9 గంటలపాటు విచారించిన సిట్
- ఎస్ఐబీ డేటా ధ్వంసంపైనే ప్రధానంగా ప్రశ్నించిన అధికారులు
- ఈ నెల 17న మళ్లీ హాజరుకావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్కు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు సహకరించడం లేదని తెలిసింది. హార్డ్ డిస్క్ల ధ్వంసం వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో వెల్లడించకుండా పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టు సమాచారం. మూడు రోజులు దాదాపు 20 గంటల పాటు విచారించినా.. సూత్రధారుల వివరాలను ప్రభాకర్రావు బయటపెట్టలేదని తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరయ్యాడు.
వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం ప్రభాకర్ రావును ప్రశ్నించారు. రాత్రి 8 గంటల వరకు దాదాపు 9 గంటల పాటు విచారించారు. రెండు రోజుల విచారణలో ప్రభాకర్ రావు నుంచి సేకరించిన సమాచారం, ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు. తదుపరి విచారణకు మళ్లీ ఈ నెల 17న హాజరుకావాలని సూచించారు. ఈ క్రమంలోనే మరికొంత మంది సాక్షుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నది.
హార్డ్ డిస్క్ల ధ్వంసంపై పొంతన లేని ఆన్సర్లు..
ఎస్ఐబీ కేంద్రంగా ప్రణీత్రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీమ్ చేసిన ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబీ డేటా ధ్వంసంపై ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభాకర్ రావు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఎస్ఐబీలో అత్యంత కీలకమైన డేటాను ధ్వంసం చేయాడానికి గల కారణాలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తున్నారు. రాష్ట్ర అంతర్గత భద్రతలో భాగంగా సేకరించిన డేటాను డిసెంబర్ 2న రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకే ధ్వంసం చేసినట్టు ప్రభాకర్రావు సిట్కు వివరించినట్టు తెలిసింది. డేటా డిలీట్ చేసిన సంగతి రివ్యూ కమిటీకి తెలుసునని ఇప్పటికే సిట్ ముందు ఆయన వెల్లడించారు. కానీ, ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీలను
అందించలేదని సమాచారం.
డిసెంబర్ 4న డేటా ధ్వంసం చేయడానికి కారణమేంటీ ?
సాధారణంగా ఎస్ఐబీ డేటా డిలీట్ చేసే అంశంపై ఏటా జనవరి, జులైలో రివ్యూ కమిటీ మీటింగ్ జరుగుతుందని సిట్ అధికారులు గుర్తించారు. కానీ, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం డిసెంబర్ 2న రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకే వ్యవహరించామని ప్రభాకర్ రావు సిట్ ముందు వెల్లడించినట్టు తెలిసింది. నిబంధనల ప్రకారం రివ్యూ కమిటీ ప్రతిపాదించిన డేటాను మాత్రమే ఎస్ఐబీ సిబ్బంది డిలీట్ చేయాలి.. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటమి తప్పదని తెలిసిన వెంటనే డిసెంబర్ 4న రాత్రి ఎస్ఐబీ హార్డ్ డిస్క్లను మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ఇందుకు గల కారణాలను ప్రభాకర్రావు చెప్పకపోవడం వ్యూహాత్మకమేనని ఆఫీసర్లు అనుమానిస్తున్నారు.