- క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్
- కపిల‑అర్జున్, సాత్విక్‑చిరాగ్ జోడీలు కూడా..
- లక్ష్యసేన్, సైనా ఔట్
టోక్యో: ఇండియా స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో దూసుకుపోతున్నాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అన్సీడెడ్ ప్రణయ్ 17–21, 21–16, 21–17తో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ లక్ష్యసేన్పై నెగ్గి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో ఇద్దరి మధ్య ముఖాముఖి రికార్డు 2–2తో సమమైంది. క్వార్టర్స్లో ప్రణయ్.. జావో జున్ పెంగ్ (చైనా)తో తలపడతాడు. ఇక మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టి 21–12, 21–10తో జీపీ బే–లాసే మెల్హాడీ (డెన్మార్క్)పై, అర్జున్–ధ్రువ్ కపిల 18–21, 21–15, 21–16తో హీ యెంగ్ టెరీ–లో కీన్ హిన్ (సింగపూర్)పై గెలిచి క్వార్టర్స్లోకి అడుగుపెట్టారు.
సైనాకు చుక్కెదురు
విమెన్స్ సింగిల్స్లో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్కు అదృష్టం కలిసి రాలేదు. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–16, 13–21తో 12వ సీడ్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ (థాయ్లాండ్) చేతిలో పోరాడి ఓడింది. దీంతో బుసానన్ ముఖాముఖి రికార్డును 5–3కు పెంచుకుంది. తొలి గేమ్లో బుసానన్ 11–3 ఆధిక్యంలోకి వెళ్లడంతో సైనా ఒత్తిడిలో పడింది. తర్వాత కాస్త గట్టిగా పోరాడిన ఇండియన్ షట్లర్ 17–19తో నిలిచినా గేమ్ను సాధించుకోలేకపోయింది. రెండో గేమ్లో వ్యూహాత్మకంగా ఆడిన సైనా 11–7తో లీడ్లో నిలిచింది. తర్వాత కూడా అటాకింగ్ గేమ్తో వరుసగా పాయింట్లతో గేమ్ను గెలిచి మ్యాచ్లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో 9–9 స్కోరు వరకు సైనా బాగానే ఆడింది. ఆ తర్వాత కోర్టులో చురుకుగా కదల్లేక క్రమంగా పాయింట్లను కోల్పోయి ఓటమిపాలైంది.