- మీటింగ్స్పై లేఖ ద్వారా సమాచారం ఇచ్చిన కమిషన్
- పీఆర్సీ ప్రతిపాదనలపై యూనియన్లతో చర్చలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండో పీఆర్సీపై అన్ని శాఖల ఉద్యోగ సంఘాలతో కమిషన్ సమావేశం కానుంది. ఈ నెల 20 నుంచి 26 వరకు తొలి దశలో ఆయా సంఘాలతో పీఆర్సీ చైర్మన్ శివశంకర్, మెంబర్ రామయ్య సమావేశమై నేతలు ఇచ్చిన ప్రతిపాదనలు, వాటి సాధ్యాసాధ్యాలపై వివరణ తీసుకోనున్నారు. సెక్రటేరియెట్ దగ్గర ఉన్న బీఆర్కే భవన్లోని పీఆర్సీ కమిషన్ కార్యాలయంలో ఈ మీటింగ్లు జరగనున్నాయి. సంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలు ఎలా సాధ్యమని వారి నుంచి వివరణ తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయా సంఘాలకు చైర్మన్ లేఖ ద్వారా సమాచారం ఇచ్చి, ఏ రోజు ఏ టైమ్కి రావాలో షెడ్యూల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో రెండో పీఆర్సీకి ప్రతిపాదనలు అందజేయాలని గత నెలలో కమిషన్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగల సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల జేఏసీ వ్యక్తిగతంగా కూడా అందజేయొచ్చని కోరింది. ఈ నెల 4వ తేదీకి తుది గడువు విధించగా మొత్తం 3 వేలకు పైగా సంఘాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని కమిషన్ చైర్మన్ శివశంకర్ ఇటీవల తెలిపారు. మీటింగ్లు నిర్వహించటానికి వీటిని ఫిల్టర్ చేశారు. తాము అందించిన ప్రతిపాదనలు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నాయని పలు సంఘాలు వెల్లడించాయి.
వీటికి సంబంధించి ఆయా ప్రభుత్వాల ఉత్తర్వులు, అమలవుతున్న వివరాలు కమిషన్కు అందజేయాల్సి ఉంటుందని చైర్మన్ పేర్కొన్నారు. వీరి నుంచి తీసుకున్న 2వ పీఆర్సీ కమిషన్ సిఫార్సులను త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది.