ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. అడ్మిషన్ షెడ్యూల్ విడుదల కాకముందే విద్యార్థుల నుండి అడ్మిషన్లు తీసుకుంటే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా ఉత్తర్వులు జారీ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరానికి కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని పేరెంట్స్ తొందరపడి అడ్మిషన్లు తీసుకోవద్దంటూ సూచించింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో గుర్తింపు ఉన్న కాలేజీల లిస్ట్ అందుబాటులో ఉంటుదని దాని ప్రకారం పేరెంట్స్ అడ్మిషన్లు తీసుకోవాలని బోర్డు తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ కాలేజీలకు మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చింది ఇంటర్ బోర్డు. ప్రైవేటు, ఎయిడెడ్, సర్కారుతో పాటు వివిధ మేనేజ్ మెంట్ల పరిధిలో కొనసాగే కాలేజీలన్నీ సెలవులు అమలు చేయాలని ఆదేశించింది. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాలిడేస్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేసింది.