వికారాబాద్, వెలుగు : కుళ్లిపోయిన మిరప, కెమికల్స్తో కారం పొడిని తయారు చేస్తున్న వ్యక్తిని వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ సెగ్మెంట్ లోని రావులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ కిరణా దుకాణం నడిపేవాడు. అతడి దుకాణంలో నకిలీ కారం పొడి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
తాండూరులో నకిలీ కారం పొడి తయారీ జరుగుతున్నట్లు లక్ష్మీకాంత్ పోలీసులకు తెలిపాడు. దీంతో శనివారం మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు తాండూరు పట్టణంలో ఉన్న పాత కూరగాయల మార్కెట్లోని ఎజాజ్ కారం పొడి దుకాణంలో సోదాలు నిర్వహించారు. ఆ దుకాణంలో కుళ్లిపోయిన రెండు క్వింటాళ్ల మిరపకాయలతో పాటు పలు కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడైనా నకిలీల గురించి తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.