కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచదేశాలు సంక్షోభంలోకి వెళ్లడంతో ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో హెచ్చరిక జారీ చేసింది. లక్షల మంది ప్రాణాలు తీసుకుంటున్న మహమ్మారి, ఇదే చివరిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ హెచ్చరించారు. వైరస్ ల విజృంభణలు నిజ జీవితంలో తప్పవని చరిత్ర స్పష్టం చేస్తోందన్నారు. రాబోయే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత సంసిద్ధంగా ఉండాలన్నారు. ఇందులో భాగంగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు భారీగా ఖర్చుచేయాల్సిన అవసరం ఉందిని WHO డైరెక్టర్ జనరల్ స్పష్టంచేశారు.
కేవలం ఏ ఒక్కదేశమో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టినంత మాత్రాన మహమ్మారిని అరికట్టలేమని WHO అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దేశాలన్నీ కలిసి ఉన్న ప్రపంచంలో, స్వల్ప ఆదాయ దేశాల ప్రజలకు వ్యాక్సిన్ అందకపోతే అది మరింత విస్తరించే ప్రమాదం ఉంటుందని తేల్చిచెప్పింది. అందుకే, ప్రతిదేశానికీ వ్యాక్సిన్ అందించడం ఎంతో కీలకమని అభిప్రాయపడింది. అందుకోసం కరోనా వ్యాక్సిన్ను అన్ని దేశాలకు సమానంగా అందేలా ‘కొవ్యాక్స్’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు టీకా తయారు చేసుకోలేని, కొనలేని దాదాపు 100 దిగువ, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. ఈ కార్యక్రమంలో భారత్ను భాగస్వామిగా చేర్చుకునేందుకు WHO ఇప్పటికే చర్చలు జరుపుతోంది.
స్పానిష్ ఫ్లూ మొదలుకొని సార్స్, మెర్స్, ఎబోలా, స్వైన్ఫ్లూ వంటి ఎన్నో వైరస్లు విజృంభిస్తూ మానవాళికి సవాల్ విసురుతూనే ఉన్నాయంది WHO. ఈ క్రమంలో కేవలం కరోనా వైరస్తోనే ఈ ప్రమాదం ముగిసిపోలేదని… రానున్న రోజుల్లో మరిన్ని వైరస్ లను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని WHO హెచ్చరించింది.