న్యూఢిల్లీ : ఇన్ఫ్లేషన్ (ధరల పెరుగుదల) ను కంట్రోల్ చేయడంలో సక్సెస్ అవుతామని, సప్లయ్ సైడ్ సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే ఓ ఫ్రేమ్ వర్క్ను ఏర్పాటు చేశామని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బుధవారం అన్నారు. దేశంలో ఇన్ఫ్లేషన్ ఈ ఏడాది జనవరి నుంచి ఆర్బీఐ పెట్టుకున్న అప్పర్ లిమిట్ 6 శాతానికి పైన నమోదవుతున్న విషయం తెలిసిందే. క్రూడాయిల్ వంటి దిగుమతి చేసుకుంటున్న కమొడిటీల వలన ఏర్పడే ఇన్ఫ్లేషన్ ఎక్కువ కాలమే ఉంటుందని సీతారామన్ అంగీకరించారు. రాయిటర్స్ నెక్స్ట్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె పై వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా మధ్యలో ఆర్బీఐ పెట్టుకున్న బ్యాండ్ (2–6%) లోకి ఇన్ఫ్లేషన్ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్ల సప్లయ్ బాగుందని, ఎనర్జీ సప్లయ్లో కూడా కంఫర్టబుల్గానే ఉన్నామని అన్నారు. రూపాయిల్లో ట్రేడ్ చేయడం కొత్త ఫ్రేమ్ వర్కేమి కాదని, గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఫ్రేమ్వర్క్ అందుబాటులో ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దీని కింద కొనడం, అమ్మడం జరుపుతామని చెప్పారు.
దేశ జీడీపీ 6.3%
మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ సెక్టార్ల పనితీరు మెరుగ్గా లేకపోవడంతో 2022–23 ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్ క్వార్టర్లో దేశ జీడీపీ 6.3 శాతానికి తగ్గింది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే క్వార్టర్లో 8.4 శాతం గ్రోత్ రేటును నమోదు చేశాం. సెప్టెంబర్ క్వార్టర్లో చైనా గ్రోత్ రేటు 3.9 శాతంగా నమోదు కావడంతో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో దేశ జీడీపీ గ్రోత్ రేటు13.5 శాతంగా నమోదయ్యింది. కాగా, ఆర్బీఐ వేసిన అంచనా 6.1–6.3 శాతానికి చేరువలో దేశ జీడీపీ గ్రోత్ రేటు నమోదు కావడం గమనించాలి. ‘దేశ జీడీపీ (2011–12 ధరల ప్రకారం) సెప్టెంబర్ క్వార్టర్లో రూ.38.17 లక్షల కోట్లుగా నమోదయ్యింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 35.89 లక్షల కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే 6.3 శాతం పెరిగింది’ అని ప్రభుత్వం పేర్కొంది.