IPL 2026 సీజన్ ఫస్టాఫ్లో టేబుల్ టాపర్స్.. కానీ ఇప్పుడు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాల్సిన కీలక దశలో.. వరుసగా ఐదో ఓటమి మూటగట్టుకుని అప్రతిష్ట పాలైంది. పాపం.. పంజాబ్ కింగ్స్ అనే పరిస్థితిలో ప్రీతీ జింటా జట్టు ఉంది. 3 ఓవర్లకు 50 పరుగులు సాధిస్తేనే ముంబై గెలుస్తుంది.
అలాంటి దశలో.. పంజాబ్ బౌలింగ్ తేలిపోయింది. ఒక బంతి మిగిలి ఉండగానే తిలక్ వర్మ, విల్ జాక్స్ ముంబైని విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ ముగిశాక పంజాబ్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్, కో-ఓనర్ ప్రీతీ జింటా మధ్య హాట్ హాట్గా డిస్కషన్ నడిచింది. బౌలింగ్ విభాగం వైఫల్యం గురించే ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది.
ఇద్దరి ముఖాల్లో నెత్తుటి చుక్క లేదు. పాంటింగ్, ప్రీతీ జింటా పంజాబ్ ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిక్కీ పాంటింగ్ అసహనం, ప్రీతి జింటా అసంతృప్తికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక్క ఓవర్లో 15 కొట్టాల్సిన సమయంలో కూడా ముంబై బ్యాటర్లను కట్టడి చేయడంలో పంజాబ్ బౌలింగ్ విఫలమైంది. 20వ ఓవర్లో మూడు సిక్సులు బాదేశారంటే.. పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 33 బంతుల్లో 6 సిక్సులు, 6 ఫోర్లతో 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన ముంబై బ్యాటర్ తిలక్ వర్మను పంజాబ్ బౌలర్లు ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు.
బౌలర్ల వైఫల్యంతో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక కీలక మ్యాచ్లో చేతులెత్తేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను పంజాబ్ కింగ్స్ క్లిష్టం చేసుకుంది. లీగ్ మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్పై గెలిచింది. టాస్ ఓడిన పంజాబ్ 20 ఓవర్లలో 200/8 స్కోరు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (32 బాల్స్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 57), అజ్మతుల్లా ఒమర్జాయ్ (38) రాణించారు. తర్వాత ముంబై 19.5 ఓవర్లలో 205/4 స్కోరు చేసి నెగ్గింది. తిలక్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
