అన్నదాతలకు అండగా… దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు చేయూతనందించేందుకు కేంద్ర సర్కారు రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఇవాళ(ఆదివారం) ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో నిర్వహించే రైతు ర్యాలీలో ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో 12.5 కోట్ల మంది రైతులకు ఒక్కోక్కరికి తొలి విడత కింద రూ.2,000 అందనుంది.
ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి రూ.6,000 చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లోనే ప్రతిపాదించింది. మూడు విడతల్లో రైతులకు ఈ మొత్తం అందుతుంది. కేంద్రం ఒక్కో రైతు అకౌంట్లోకి రూ.2,000 చొప్పున మొదటి విడత నగదును బదిలీ చేయనుంది.