- శనివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్కు..
- అక్కడే బీజేపీ ముఖ్యనేతలతో చర్చ
- 3.30కు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం
- ఎన్టీపీసీ గ్రౌండ్లో జరిగే సభలో ప్రసంగించనున్న పీఎం
హైదరాబాద్, గోదావరిఖని, వెలుగు: మోడీ శనివారం రాష్ట్రానికి రానున్నారు. 12న ఏపీలోని విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పీఎం పాల్గొని.. మధ్యా హ్నం 1.30కి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని పీఎంఓ గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధానికి బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడే బీజేపీ ముఖ్య నేతలతో మోడీ కొద్దిసేపు మాట్లాడుతారు. తర్వాత 2.15 గంటలకు ఎంఐ–17 హెలికాప్టర్లో రామగుండం బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.30కు రామగుండం ఎరు వులు, రసాయనాల పరిశ్రమ (ఆర్ఎఫ్సీఎల్)ను ప్రధాని ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15కి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పీఎంవో పేర్కొంది. అనంతరం రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్లో జరి గే బహిరంగ సభలో మోడీ మాట్లాడుతారు. రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్తోపాటు మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పీఎంఓ తెలిపింది. ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు – సత్తుపల్లి రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారని పేర్కొంది. నేషనల్ హైవే పనులకూ శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంఓ సమాచారం ఇచ్చింది. సాయంత్రం 6.30 గంటలకు బేగంపేటకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
2,500 మంది పోలీసులతో భద్రత
అధికారులు భారీ ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అడిషనల్ ఐజీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి 40 మంది సభా ప్రాంగణం, ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. సభ జరిగే ప్రాంతం దరిదాపుల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మూడు ఆర్మీ చాపర్స్ ఎన్టీపీసీకి చేరుకున్నాయి. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు చాపర్ల ద్వారా పర్యవేక్షించారు. ఎన్టీపీసీ స్టేడియంలో సభా స్థలానికి దగ్గరలో రెండు హెలిప్యాడ్లు, రామగుండం పోలీస్ హెడ్ క్వార్టర్లో మరో హెలిప్యాడ్ను సిద్ధం చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్లోని ఆఫీసర్లతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ఐదుగురు ఎస్పీలు, ఐదుగురు అడిషనల్ ఎస్పీలు, 25 మంది డీఎస్పీలతో సహా మొత్తం 2,500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్టు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం సీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని కొన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ప్రకటనలు చేస్తున్నాయని, ఎవరైనా సభలో గానీ, బయట నీ ప్రధాని టూర్కు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, సీపీ హెచ్చరించారు.
తొమ్మిది భారీ స్క్రీన్లు
ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభ వద్దకు ప్రజలు, రైతులు చేరుకునేందుకు ఎన్టీపీసీ బి‒టైప్ గేట్ను ఓపెన్ చేశారు. ఈ మార్గంలో బస్సులు, ఇతర వాహనాలను అనుమతిస్తారు. గెస్ట్ హౌస్ ముందు నుంచి ఏసీ ఫంక్షన్ హాల్ పక్కన ఖాళీ స్థలం, కేంద్రీయ విద్యాలయం గ్రౌండ్లో వాహనాలను పార్క్ చేసి.. సభ వద్దకు చేరుకునేలా బారికేడ్లను నిర్మించారు. ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ, రైల్వే, నేషనల్ హైవేస్ వింగ్ ఆఫీసర్లు, ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా ఈ సభకు రానున్నారు. సభ వేదికను ఎనిమిది ఫీట్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ప్రధాని స్పీచ్ను అందరూ చూసేందుకు వీలుగా ఆరు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక దగ్గర మరో మూడు భారీ స్క్రీన్లను సిద్ధం చేశారు.