న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ ఎకో సిస్టంను బలోపేతం చేసే విషయంలో మన దేశం సరైన దిశలోనే ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)ని ప్రపంచం కొనియాడుతోందన్నారు. ఈ పాలసీకి రూపకల్పన చేయడంలో టీచర్లు కీలక పాత్ర పోషించారన్నారు. సోమవారం ఢిల్లీలో టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అవార్డులు సాధించిన టీచర్లతో ప్రధాని మోడీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా టీచర్ల పాత్రను మోడీ కొనియాడారు.
స్టూడెంట్లకు చదువు చెప్పడమే కాకుండా వారి జీవితాలను మార్చేది గురువులే అని అన్నారు. 2047 నాటికి మన దేశం ఎలా ఉండాలో డిసైడ్ చేసేది.. అందుకు యువతను సిద్ధం చేసేది టీచర్లే అని అన్నారు. సక్సెస్ఫుల్ టీచర్లకు స్టూడెంట్లందరూ సమానమేనని, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువా కాదన్నారు. సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. ఇది సాధిస్తే భవిష్యత్లో వారు ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కోగలుగుతారని చెప్పారు. బ్రిటన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలవడం ప్రత్యేకమైనదని అన్నారు. 250 ఏండ్లు మనల్ని పాలించిన వారిని మనదేశం ఇప్పుడు దాటేసిందని మోడీ చెప్పారు.