జోర్డాన్‌ చేరుకున్న మోదీ

జోర్డాన్‌ చేరుకున్న మోదీ
  •   ఈ పర్యటనతో భారత్- జోర్డాన్ రిలేషన్స్ మరింత బలోపేతం

అమ్మాన్: రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్‌‌‌‌ చేరుకున్నారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అమ్మాన్​లోని విమానాశ్రయంలో ల్యాండ్​ అయిన మోదీకి జోర్డాన్ ప్రధాని జఫర్ హసన్ స్వాగతం పలికారు. మోదీ తన నాలుగు రోజుల టూర్​లో మూడు దేశాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా తొలుత జోర్డాన్ వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఇథియోపియా, ఒమన్‌‌‌‌ దేశాలకు వెళ్లనున్నారు. మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా రెండో ఇబ్న్ అల్ హుస్సేన్‌‌‌‌ను కలిసి మాట్లాడతారు. 

మంగళవారం మోదీ, రాజు అబ్దుల్లా కలిసి భారత్–జోర్డాన్ వ్యాపార సదస్సులో మాట్లాడతారు. దీనికి రెండు దేశాల ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతారు. మోదీ జోర్డాన్‌‌‌‌లోని భారతీయ సమాజంతో కూడా సమావేశమవుతారు. పరిస్థితులు అనుకూలిస్తే క్రౌన్ ప్రిన్స్‌‌‌‌తో కలిసి చారిత్రక నగరం పెట్రాను సందర్శించే అవకాశం ఉంది. పెట్రాకు భారత్‌‌‌‌తో పురాతన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇది మోదీ మొదటి పూర్తి స్థాయి ద్వైపాక్షిక జోర్డాన్ పర్యటన. 2018లో పాలస్తీనా వెళ్లే మార్గంలో ఆయన జోర్డాన్‌‌‌‌లో ఆగారు. అప్పుడు రాజు మోదీకి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. 37 ఏండ్ల తర్వాత భారత ప్రధాని జోర్డాన్ లో పూర్తిస్థాయిలో పర్యటన చేస్తున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం బలంగా ఉంది. భారత్–జోర్డాన్‌‌‌‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ద్వైపాక్షిక వాణిజ్యం 2.8 బిలియన్ డాలర్లుగా ఉంది. జోర్డాన్ నుంచి ఫాస్ఫేట్లు, పొటాష్  తదితర ఎరువులు భారత్ కు దిగుమతి అవుతున్నాయి.