డిఫెన్స్ ‘పవర్’లో మేటిగా ఎదిగాం : ప్రధాని నరేంద్ర మోదీ

డిఫెన్స్ ‘పవర్’లో మేటిగా ఎదిగాం : ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ:  డిఫెన్స్ సెక్టార్ లో గత 11 ఏండ్లలో గణనీయమైన మార్పులు వచ్చాయని, రక్షణ రంగంలో మేటిగా ఎదిగామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘రక్షణ రంగం ఆధునీకరణ, ఉత్పత్తిలో స్వయం సమృద్ధిపైనే స్పష్టమైన ఫోకస్ పెట్టాం. ఇండియాను బలమైన శక్తిగా నిలిపేందుకు దేశ ప్రజలంతా ఏకతాటిపైకి రావడం చాలా సంతోషకరం” అని ఆయన పేర్కొన్నారు.  ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటికి 11 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ‘‘ఇండియాస్ రైజ్ ఇన్ 11 ఇయర్స్: పవర్, పార్టనర్షిప్స్ అండ్ ప్రోగ్రెస్”పేరుతో మైగవ్ఇండియా ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టింది.

ఆ పోస్ట్ ను ప్రధాని మోదీ షేర్ చేశారు. కాగా, ప్రధాని మోదీ నాయకత్వంలో గత 11 ఏండ్లలో భారత రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ ఫామ్ ‘మైగవ్ఇండియా’ వెల్లడించింది. ‘‘దేశ రక్షణ రంగ ఎగుమతులు 2014–15లో రూ. 1,940 కోట్ల మేరకు ఉండగా.. 2024‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–25 నాటికి రూ. 23,622 కోట్లకు పెరిగాయి. తొలి స్వదేశీ యుద్ధవిమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ను ఆవిష్కరించుకున్నాం. భారత మిసైల్ పవర్ తిరుగులేని స్థాయికి చేరింది. బ్రహ్మోస్ క్షిపణి ఎక్స్ టెండెడ్ వెర్షన్ ను సుఖోయ్, ఇతర యుద్ధ విమానాల నుంచీ పరీక్షించాం” అని పేర్కొంది.

‘‘గత పదకొండేండ్లలో గ్లోబల్ పార్టనర్షిప్ లు బలోపేతం అయ్యాయి. అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక మైలురాళ్లను చేరుకున్నాం. ప్రధాని మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఇన్నోవేషన్, ట్రేడ్, టెక్నాలజీ వంటి రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాం. ఇది ఆత్మవిశ్వాసంతో కూడిన, నిర్ణయాత్మక, గౌరవప్రదమైన గ్లోబల్ లీడర్ గా ఎదిగిన ఇండియా కథ. బలమైన భారత్ కోసం ప్రధాని మోదీ విజన్, అంకితభావం వల్ల ఇది సాధ్యమైంది.

యూకే, యూఏఈతో చరిత్రాత్మకమైన ట్రేడ్ డీల్స్ కుదిరాయి. ఇతర దేశాలతోనూ సంబంధాలు బలోపేతం అయ్యాయి. యూఎన్ శాంతిపరిరక్షక దళానికి ప్రపంచవ్యాప్తంగా 50 మిషన్లలో 2.9 లక్షల మంది బలగాలను అందించడం ద్వారా భారత్ లీడింగ్ ఫోర్స్ గా ఉంది. యూఎన్ పీస్ కీపర్స్ కు కరోనా విపత్తు సమయంలో 2 లక్షల డోసుల వ్యాక్సిన్ నూ అందించాం” అని వివరించింది.