ఈనెల 13న వారణాసిలో ‘గంగా విలాస్’ను ప్రారంభించనున్న ప్రధాని
గంగా, బ్రహ్మపుత్రసహా 27 నదులగుండా 52 రోజుల పాటు ప్రయాణించనున్న విలాసనౌక
ఇండియాలోని మొట్టమొదటి నదీ పర్యటక నౌక ‘ఎంవీ గంగా విలాస్ ’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 13వ తేదీన వారణాసిలో ప్రారంభించనున్నారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా పేరొందింది. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా రూపొందించిన ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సూట్ గదులు, స్పా, జిమ్ సెంటర్ల వంటివి ఇందులో ఉన్నాయి.
* భారత్లోని ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, అస్సాంతో పాటు బంగ్లాదేశ్లోని నదుల్లో ఈ నౌక ప్రయాణించనుంది. ప్రధాన నదులైన గంగా, బ్రహ్మపుత్రతో పాటు భాగీరధి, హుగ్లీ, బిద్యావతి, మాట్లా, బంగ్లాదేశ్లతోని మేఘన, పద్మ, జమున నదుల్లో విహరించనుంది.
* గంగా విలాస్ యాత్ర ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మొదలయ్యే అస్సాంలోని దిబ్రుగఢ్లో ముగుస్తుంది. మొత్తం 51 రోజుల ప్రయాణంలో 50 ప్రముఖ పర్యటక ప్రాంతాల్లో ఆగుతుంది.
* వారణాసిలోని గంగా హారతి, విక్రమశిల యూనివర్శిటీ, సుందర్బన్ డెల్టా, కజీరంగా నేషనల్ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ఈ యాత్రలో చూడొచ్చు.
* 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడెల్పు ఉండే ‘ఎంవీ గంగా విలాస్ ’లో 18 సూట్లు ఉన్నాయి. 36 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. మూడు సన్ డెక్లు, జిమ్ సెంటరు, స్పా సదుపాయం ఉంది.
ఈనెల 13వ తేదీన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించిన తర్వాత ఈ నౌక తొలి ప్రయాణం మొదలవుతుంది. తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్కు చెందిన 32 మంది ప్రయాణికులు పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు. అంటే ఈ యాత్ర మొత్తానికి రూ.12.75లక్షల ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ నౌక టికెట్లను లగ్జరీ రివర్ క్రూజెస్లో బుక్ చేసుకోవచ్చు.