తొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ

తొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ

లండన్: ఫోన్ హ్యాకింగ్​కు సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ కింగ్ చార్లెస్ III రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు. దీంతో 130 ఏండ్ల తర్వాత కోర్టు మెట్లెక్కిన బ్రిటన్ రాజ వంశీయుడిగా హ్యారీ నిలిచారు. బ్రిటన్​కు చెందిన మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ సంస్థ.. వీవీఐపీల వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు చట్టవ్యతిరేక పనులు చేస్తోందంటూ ప్రిన్స్ హ్యారీతో సహా వంద మందికిపైగా ప్రముఖులు నష్ట పరిహారం కేసు వేశారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హ్యారీ కోర్టుకు వచ్చారు.

డైలీ మిర్రర్, సండే మిర్రర్, సండే పీపుల్ సంస్థలు 1996–2010 మధ్య కాలంలో ప్రైవేటు ఇన్వెస్టిగేటర్లను ఉపయోగించి తన పర్సనల్ డేటాను చోరీ చేశాయని ఆరోపించారు. అలా సేకరించిన సమాచారంతో 140 ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయన్నారు. తనపై ప్రజల్లో ద్వేషాన్ని రేకెత్తించేలా కథనాలు పబ్లిష్ చేశాయని కోర్టుకు వివరించారు. హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానా వాయిస్ మెయిల్​ సందేశాలను కూడా మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ హ్యాక్ చేసి విన్నాయని హ్యారీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.