గండిపేట్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రైవేట్ బస్సు పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రయాణికులతో బయలుదేరిన ‘మార్నింగ్ స్టార్’ అనే ప్రైవేటు బస్సు.. రాత్రి 8.30 గంటలకు నార్సింగి ఓఆర్ఆర్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది.
బస్సులో మొత్తం 18 మంది ఉన్నారు. బస్సు చక్రాల కింద పడి ఓ ప్రయాణికురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరో 16 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని.. క్షతగాత్రులను హాస్పిటల్స్కు తరలించారు. రెండు క్రేన్ల సాయంతో బస్సును బయటకు తీశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ ను నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రమణ గౌడ్, సీఐ హరికృష్ణ రెడ్డి, ఎస్సై అశోక్ వర్మ పరిశీలించారు.