- ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, వెలుగు: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం 20 శాతం బెడ్లు తప్పనిసరిగా కేటాయించాలని, లేదంటే ఆ ఆస్పత్రులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు 450 రెమ్డిసివిర్ ఇంజక్షన్లు ఇవ్వాలని ప్రపోజల్స్ పంపామని, ఎమ్మార్పీకే ఇంజక్షన్లను పేషెంట్లకు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 250 ఆక్సీజన్ బెడ్లు ఉన్నాయని, మరో 250 బెడ్లు సిద్ధం చేయాల్సిఉందన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో రూ. 1999కే సిటీ స్కాన్ చేసేందుకు అసోసియేషన్ అంగీకరించిందని మంత్రి తెలిపారు. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఆర్డీవో, డీఎస్పీ, డ్రగ్ ఇన్స్పెక్టర్తో ఒక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ టీమ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్ల నుంచి వసూలు చేసే బిల్లులు , వారికి కల్పిస్తున్న సేవలపై నిఘా పెడుతుందని చెప్పారు.