డబ్బులు ఇవ్వండి.. బండ్లగూడలో పెన్షన్దారుల ఇబ్బందులు

డబ్బులు ఇవ్వండి.. బండ్లగూడలో పెన్షన్దారుల ఇబ్బందులు

రంగారెడ్డి జిల్లాలో పెన్షన్ కోసం లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు నెలల నుంచి పెన్షన్ రాక నానా అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ పోస్ట్ ఆఫీస్ వద్ద పెన్షన్ దారులు క్యూ కట్టారు. పెన్షన్ డబ్బుల కోసం తిరిగే ఓపిక కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక.. తమను పట్టించుకునే దిక్కులేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. 

పెన్షన్ డబ్బుల కోసం రోజూ పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని అంటున్నారు. గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదని ఫోస్ట్ ఆఫీస్ అధికారులు తిప్పి పంపిస్తున్నారని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని అడుగుతున్నారు. తమకు రావాల్సిన పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామంటున్నారు. అంతకుముందు ఫింగర్ ప్రింట్ పడలేదని ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టారని... ఆవేదన చెందుతున్నారు. రేపటి లోగా తమకు పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే.. ఈనెల 9న జరగనున్న సీఎం మెట్రో ట్రైన్ రెండో దశ సభను అడ్డుకుంటామని పెన్షన్ దారులు హెచ్చరించారు.