హైదరాబాద్సిటీ, వెలుగు: ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉంటే ప్రజావాణికి వచ్చే సమస్యల మూలాలు అర్థమై వాటి పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని సీఎం ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి తెలిపారు. మంగళవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజావాణి అమలు తీరుపై పైలెట్ ప్రాజెక్టు నివేదికను చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీర్ దివ్య దేవరాజన్ తో కలిసి ఆవిష్కరించారు.
ప్రజావాణికి వివిధ సమస్యలతో వచ్చే దరఖాస్తుదారులతో అధికారులు, సిబ్బంది సానుకూల ధోరణితో స్పందించాలని, అప్పుడే పిటిషనర్ల ముఖంలో సంతోషం చూడగలుగుతామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కొనసాగుతున్న ప్రజావాణిని డివిజన్ స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం విస్తరించిందని, రానున్న కాలంలో మండల స్థాయిలో కూడా నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు.
