
సినీ కార్మికుల సమ్మె నిర్ణయంతో నేడు చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయిందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ అన్నారు. ఇవాళ టాలీవుడ్ లో సినీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఇచ్చిన హామీతో కార్మికులు సమ్మె విరమించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్మాతల మండలి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీన మాకు ఫెడరేషన్ నుంచి లేఖ వచ్చింది. అంతకంటే ముందే వేతనాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆలోచిస్తుందన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం చాలా తప్పు అని..షూటింగ్ లు ఆపేదే లేదని కళ్యాణ్ స్పష్టం చేశారు. రేపటి నుంచి యథావిధిగా కార్మికులు షూటింగ్స్ కు హాజరుకావాలన్నారు.
వేతనాలపై విధి విధానాలు రూపకల్పన చేస్తాం.. ఈ అంశంపై 5 కండీషన్స్ పెడుతున్నామని తెలిపారు. ఫెడరేషన్ నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలని సూచించారు. సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దని సి.కళ్యాణ్ తెలిపారు. ఇప్పుడు అందరం కలిసి షూటింగ్ లు జరుపుకుందామని..ఎల్లుండి వేతనాలపై చర్చిస్తామని వెల్లడించారు.
ఏ కార్మికుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడరని ఈ సందర్భంగా కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కార్మికులందరికి వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. వేతనాలపై 2018లో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కార్మికుల కడుపు కొట్టొద్దని కోరారు. సినిమా కార్మికులు హాజరుకాకపోతే మేమే షూటింగ్ లు ఆపేస్తామని సి. కళ్యాణ్ పేర్కొన్నారు.