
గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ ‘‘కొత్త జానర్ కథ ఇది. గోపీచంద్ ఇంతకుముందు పోలీస్ పాత్రలు చేసినా.. ఇందులో పాత్ర డిఫరెంట్గా ఉంటుంది. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉండే పరశురామక్షేత్రంలో జరిగే కథ ఇది.
అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక భారీ టెంపుల్ సెట్ని క్రియేట్ చేశాం. అలాగే బెంగళూరు, మంగళూరు, బాదామి, ఉడిపి, మారేడుమిల్లి, వైజాగ్ లాంటి డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేశాం. కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీపడకుండా తీశాం. మేం అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగినప్పటికీ.. బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం. టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ కూడా క్లోజ్ చేశాం. అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యుటర్స్ సినిమాపై చాలా ఆసక్తి చూపించారు.
పెద్ద సంఖ్యలో రిలీజ్ చేస్తున్నాం. గోపీచంద్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్. హర్ష చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తను కొరియోగ్రాఫర్ కూడా. మా ‘బెంగాల్ టైగర్’ సినిమాకి తను వర్క్ చేశారు. ‘భీమా’ని చాలా అద్భుతంగా తీశారు. అలాగే ఇందులో రెండు పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు. ప్రియా భవానీ శంకర్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తుంది. రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది.
థియేటర్స్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇక ఆయుష్ శర్మ హీరోగా ఒక హిందీ సినిమా నిర్మిస్తున్నాం. ఏప్రిల్ 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది’ అని చెప్పారు.