ముషీరాబాద్, వెలుగు : సంపదకు మూలమైన కార్మికులకు సంపాదన లేకపోవడం అన్యాయమని ప్రొఫెసర్ సర్హరగోపాల్ అన్నారు. భద్రతలేని కార్మికుల జీవి తాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలనలో ధర్నా చౌక్ ఎరుపెక్కి 9,000 మందితో ధర్నా చేయవలసిన ఆగత్యం ఏర్పడిందన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అధ్యక్షతన కార్మిక గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ సందర్భంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అన్న పదమే లేకుండా చేస్తానన్న కేసీఆర్.. 3 లక్షల మంది కాంట్రా క్టు కార్మికులను నియమించారన్నారు. దేశంలో అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.
ఇల్లు, వైద్యం, ఉపాధి లేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసమానతలు తగ్గించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంక్షేమ పథకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని హరగోపాల్ మండిపడ్డారు. సీపీఐఎంఎల్ ప్రజా పంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగాల రద్దుచేస్తూ కేసీఆర్, మోదీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ను పెంచుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.