హైదరాబాద్, వెలుగు: వరంగల్– ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ జన సమితి (టీజేఎస్) క్యాండిడేట్గా పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్రావు ప్రకటించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ సమాజం తరఫున చట్టసభల్లో ప్రశ్నించే గొంతుక కోసమే కోదండరాం పోటీ చేస్తున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందని, కానీ ఈ ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలైందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ లో ఎన్రోల్ చేసుకుంటే 29 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయని సర్కార్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్స్కు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో సోమవారం మీడియా సమావేశంలో పీఎల్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర పాలనలో చవిచూసిన నిర్బంధానికి మించి తెలంగాణలో చూస్తున్నామని, ఆందోళనకు దిగితే అర్ధరాత్రి అరెస్టులు, గృహ నిర్బంధం చేస్తున్నారని విశ్వేశ్వర్రావు మండిపడ్డారు. మచ్చ లేని నేతగా పేరున్న కోదండరాంకు మద్దతుగా నిలిచి ప్రజలు సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. కోదండరాం అభ్యర్థిత్వానికి ఇప్పటికే టీఆర్ఎస్యేతర పార్టీల మద్దతు కోరామని, అన్ని పార్టీల నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ సందర్భంగా టీజేఎస్ వరంగల్– ఖమ్మం– నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక పోస్టర్, పాంప్లెంట్ను ఆవిష్కరించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంకండి: కోదండరాం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీజేఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.