ముంబై: కష్టార్జితాన్ని దాచుకునే డిపాజిటర్ల డబ్బును కాపాడం బ్యాంకర్లకు పవిత్రమైన విధి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. దేవాలయంలోనో, గురుద్వారాలోనో, మసీదులోనో ప్రార్ధన చేయడం కంటే ఈ విధి ముఖ్యమైనదని, గొప్పదని పేర్కొన్నారు. చిన్న మొత్తాలను దాచుకునే మిడిల్ క్లాస్, రిటైరయిన వ్యక్తుల డిపాజిట్లపైనే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తోందని చెప్పారు. కాబట్టి, డిపాజిటర్ల డబ్బును పరిరక్షించడమే బ్యాంకర్లకు ప్రధానమైన బాధ్యతని దాస్ అన్నారు. ఆగస్టు 30 నాడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వీడియోను యూట్యూబ్లో ఆర్బీఐ సోమవారం అప్లోడ్ చేసింది.
అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకుల డైరెక్టర్లను ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ ఆ రోజు మాట్లాడారు. డిపాజిటర్ల డబ్బు భద్రంగా ఉండేలా బ్యాంకులతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఆర్బీఐ పైన ఉంటుందని దాస్ పేర్కొన్నారు. ఈ దిశలోనే రెగ్యులేషన్స్ తేవడంతో పాటు, సూపర్విజన్ బాధ్యతను ఆర్బీఐ నిర్వహిస్తుందని అన్నారు. దేశపు ఎకానమీ సక్రమంగా నడవాలంటే బ్యాంకింగ్ సిస్టమ్ నిలకడగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.