ఫిక్స్​డ్​ డిపాజిట్లు పెట్టిన ఇన్వెస్టర్లకు ఉన్న రక్షణ ఏమిటో తెలుసా..?

 ఫిక్స్​డ్​ డిపాజిట్లు పెట్టిన ఇన్వెస్టర్లకు ఉన్న రక్షణ ఏమిటో తెలుసా..?

బిజినెస్​ డెస్క్​, వెలుగు: అమెరికాలో  సిలికాన్​ వ్యాలీ బ్యాంక్​, సిగ్నేచర్​ బ్యాంక్​లు దివాలా తీయడంతోపాటు, మరో పెద్ద బ్యాంకు క్రెడిట్​ స్వీస్​ దివాలా అంచులకు చేరిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫిక్స్​డ్​ డిపాజిట్లలో డబ్బులు పెట్టిన వారిలో సహజంగానే ఆందోళన పెరుగుతోంది. మన దేశంలో బ్యాంకులలో ఫిక్స్​డ్​ డిపాజిట్లు పెట్టిన ఇన్వెస్టర్లకు ఉన్న రక్షణ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా బ్యాంకు ఫెయిలైనప్పుడు డిపాజిట్లలో డబ్బు పెట్టిన వారికి ఉండే ఏకైక రక్షణ డిపాజిట్​ ఇన్సూరెన్స్​ అండ్ క్రెడిట్​ గ్యారంటీ కార్పొరేషన్​ (డీఐసీజీసీ) మాత్రమే. డీఐసీజీసీ ఇచ్చే ఇన్సూరెన్స్​ కవర్​ను 2020 ఫిబ్రవరి 4 నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. అంటే రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారికే ఇన్సూరెన్స్ దక్కుతుంది. అంతకు ముందు ఇది కేవలం రూ. లక్షే. డిపాజిట్లపై ఇన్సూ రెన్స్ కోసం మరొక ఆప్షన్​ అందుబాటులో ఉంది. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై రూ. 65 లక్షల దాకా ఇన్సూరెన్స్​ కవర్​ను పొందే వెసులుబాటు దీని వల్ల కలుగుతుంది. ఒకే బ్యాంకులో ఫిక్స్​డ్​ డిపాజిట్లున్నా, ఈ ఆప్షన్​ కుదురుతుంది. సేవింగ్స్​ అకౌంట్లు, ఫిక్స్​డ్​ డిపాజిట్లు, కరెంట్​ అకౌంట్లు, రికరింగ్​ డిపాజిట్లు (ఆర్​డీ) వంటి వాటిపై డీఐసీజీసీ ఇన్సూరెన్స్​ కవరేజ్​ అందుబాటులో ఉంటుంది. 

ఇదెలా పనిచేస్తుందంటే...

ఏదైనా బ్యాంకు లిక్విడేషన్​ జరిగినప్పుడు లేదా ఆ బ్యాంకు లైసెన్స్​ క్యాన్సిల్​ అయినప్పుడు అసలు, దానిపై వడ్డీ కలిపి రూ. 5 లక్షల మొత్తానికి డీఐసీజీసీ ఇన్సూరెన్స్​ కవరేజ్​ దొరుకుతుంది. ఒకే హక్కుతో, ఒకే కెపాసిటీలో పెట్టే అకౌంట్లు అన్నింటిలోనూ, అంటే  సేవింగ్స్​, కరెంట్​ అకౌంటు, ఎఫ్​డీ లేదా ఆర్​డీ అన్నింటికీ కలిపే ఈ ఇన్సూరెన్స్​ కవరేజ్​ ఉంటుందన్నమాట. అసలు, దానిపై వడ్డీ ఇందులోనే కలిసి ఉంటాయని మర్చిపోకూడదు. ఉదా. ఒకరి ప్రిన్సిపల్​ అమౌంట్​ రూ. 5 లక్షలనుకుంటే, ఇన్సూరెన్స్​కవరేజ్​ అంతదాకానే ఉంటుంది. ఆ ప్రిన్సిపల్​ అమౌంట్​పై అప్పటిదాకా అక్యుములేట్​ అయిన వడ్డీకి ఇన్సూరెన్స్​ కవరేజ్​  దొరకదు. ఒకవేళ ప్రిన్సిపల్​, దానిపై వడ్డీ కలిపిన తర్వాత ఉండే మొత్తం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఎంత మొత్తం ఉంటే అంత మొత్తమూ  తిరిగి పొందేందుకు వీలుంటుంది. కాబట్టి, ఇన్సూరెన్స్​ కవరేజ్​ లెక్కించుకునేటప్పుడు మెచ్యూరిటీ అమౌంట్​ను పరిగణనలోకి తీసుకోవడం మేలు. ఒకవేళ డిపాజిట్​పై వడ్డీ ని ఎప్పటికప్పుడు తీసుకుంటుంటే లెక్కింపులో ఎలాంటి సమస్య ఉండదు. 

ఎక్స్​ట్రా ఇన్సూరెన్స్​ ఎలా దొరుకుతుంది..

వేరు వేరు హక్కులు, కెపాసిటీలలో కనక మనం మన డిపాజిట్లను పెడితే అలాంటప్పుడు ప్రతీ డిపాజిట్​కు రూ. 5 లక్షల దాకా ఇన్సూరెన్స్​ కవరేజ్​ దొరుకుతుందని డీఐసీజీసీ గైడ్​లైన్స్​ చెబుతున్నాయి. ఒకే బ్యాంకులో డిపాజిటర్లు వివిధ ఫిక్స్​డ్​ డిపాజిట్లను వేరు వేరు హక్కులు, కెపాసిటీలతో ఓపెన్​ చేయొచ్చు. సింపుల్​గా చెప్పాలంటే, స్పౌజ్​ (భార్య లేదా భర్త), సోదరుడు, పిల్లలతో కలిసి జాయింట్​గా ఎఫ్​డీ ఓపెన్​ చేయడన్నమాట. అలాగే, ఏదైనా ఫర్మ్​లో పార్ట్​నర్​గా, మైనర్​కు గార్డియన్​గా ...ఇలా వేరు వేరు కెపాసిటీలలో ఉండే డిపాజిట్లకు వేరు వేరుగా రూ. 5 లక్షల దాకా ఇన్సూరెన్స్​ కవరేజ్​ పొందే వెసులుబాటు ఉంది. కాబట్టి, ఇన్సూరెన్స్​ డిపాజిట్​ కవరేజ్​ ఎక్కువ చేసుకోవాలంటే మనం ఎఫ్​డీ చేసేప్పుడు వేరు వేరు హక్కులు, కెపాసిటీలతో చేసుకోవడం మేలని ఇన్వెస్ట్​మెంట్​ అడ్వైజర్ కల్నల్​ సంజీవ్​ గోవిలా సలహా ఇస్తున్నారు. ఉదా. ఏ అనే ఒక వ్యక్తి కుటుంబంలో ఆరుగురు మెంబర్లున్నారనుకుందాం. ఈ ఏ అనే వ్యక్తి తన పేరుతో ఒక డిపాజిట్​ ఓపెన్​ చేశారనుకుంటే, ఒక ఫర్మ్​లో పార్ట్​నర్​గా, మైనర్​ పిల్లలకు గార్డియన్​గా, లేదా కంపెనీలో డైరెక్టర్​గా, ట్రస్టులో ట్రస్టీ కెపాసిటీలో, తన భార్యతో కలిసి ఒక జాయింట్​ అకౌంట్​, తన తల్లి, తండ్రులతో కలిసి వేరు వేరు జాయింట్​ అకౌంట్లు..ఇలా వేరు వేరు హక్కులు, కెపాసిటీలతో డిపాజిట్​ అకౌంట్లను ఏ అనే వ్యక్తి ఓపెన్​ చేసుకోవడానికి వీలుంటుంది. అలాంటప్పుడు ఆయా డిపాజిట్లన్నింటిపైనా కవరేజ్​ పొందే అవకాశం చిక్కుతుంది. ఒక్కో డిపాజిట్​పైనా రూ. 5 లక్షల లిమిట్​ అనుకున్నా..గరిష్టంగా రూ. 65 లక్షల దాకా ఇన్సూరెన్స్​ కవరేజ్​ పొందొచ్చు. కానీ,ఇండివిడ్యువల్​గా ఒక డిపాజిట్​ అకౌంట్​, ప్రొప్రైటర్​ హోదాలో మరో డిపాజిట్​ అకౌంటు తెరిచినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్​ కవరేజ్​ పెంచుకోవడం వీలవదు. ఈ రెండింటినీ కలిపి ఒకే అకౌంటుగా పరిగణించి, రూ. 5 లక్షల వరకే  ఇన్సూరెన్స్​ కవరేజ్​ ఇస్తారు.


ఇలా జాగ్రత్తపడండి...

యెస్​ బ్యాంక్​, పీఎంసీ బ్యాంకు వంటి మన దేశంలోని బ్యాంకులు కూడా ఇటీవల కాలంలో ఫెయిల వడం మనం చూశాం. కాబట్టి, మన డిపాజిట్లను కాపాడుకోవా లంటే మన దగ్గరున్న మొత్తమంతా ఒకే ఫిక్స్​డ్​ డిపాజిట్​గా పెట్టడం మంచిది కాదు. వీలైతే వేరు వేరు హోదాలు, కెపాసిటీలలో ఆ మొత్తా న్ని విభజన చేసి ఫిక్స్​డ్​ డిపాజిట్లుగా పెట్టుకోవడం మేలనేది నిపుణుల సూచన.​

అన్ని బ్యాంకులకూ డీఐసీజీసీ ఇన్సూరెన్స్​..

దేశంలోని అన్ని  కమర్షియల్ బ్యాంకులు, ఫారిన్​ బ్యాంకులు, లోకల్​ ఏరియా బ్యాంకులు, రీజినల్​ రూరల్​ బ్యాంకులలోని డిపాజిట్లపై డీఐసీజీసీ ఇన్సూరెన్స్​ కవరేజ్​ వర్తిస్తుంది. ప్రైమరీ కో–ఆపరేటివ్​ సొసైటీలలోని డిపాజిట్లు మాత్రం డీఐసీజీసీ పరిధిలోకి రావు. అంతేకాదు, ఎన్​బీఎఫ్​సీలు, హెచ్​ఎఫ్​సీ లేదా ఇతర కార్పొరేట్​ సంస్థలలోనూ డీఐసీజీసీ ఇన్సూరెన్స్​ కవరేజ్​ అందుబాటులో ఉండదు.