
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో ఔట్సోర్సింగ్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం నిరుద్యోగ అభ్యర్థులు, ప్రజా సంఘాల నాయకులు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. మెడికల్ కాలేజీలో 52 పోస్టులను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిన అధికారులు మెరిట్ లిస్ట్ ఆధారంగా కాకుండా ఇష్టానుసారంగా పోస్టులను భర్తీ చేశారని ఆరోపించారు.
అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు మెరిట్ జాబితాను రూపొందించి.. మెరిట్ ఆధారంగా కాకుండా ఇష్టారీతిన అభ్యర్థులకు ఇంటర్వ్యులకు పిలవడం, జాబితాలో ఉన్నవారికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి అర్హు లకు పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం అందించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు, జిల్లా ఇన్చార్జి దుర్గం తుకారం, భీమ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.