
హైదరాబాద్, వెలుగు : దినపత్రిక రంగంలో పనిచేస్తున్న డిస్ర్టిబ్యూటర్లకు ,పేపర్ బాయ్స్కు రూ.20 లక్షల ఆరోగ్య బీమాతోపాటు రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ర్టిబ్యూటర్స్అసోసియేషన్ కోరింది. 80 శాతం సబ్సిడీతో ఈ చార్జింగ్బైకులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం అసోసియేషన్ మొదటి మహాసభ హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా 2024 డైరీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వనమాల సత్యం, ప్రధాన కార్యదర్శి కూడలి రామ్ప్రసాద్రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో దాదాపు 30 లక్షల సర్కిలేషన్ ఉన్న దినపత్రికలను తెల్లవారకముందే గడప గడపకు చేరవేస్తున్నామని తెలిపారు. ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పేపర్ వేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల లోడింగ్పంపిణీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. కార్మిక శాఖ నుంచి గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆసరా పథకం ద్వారా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.