న్యూఢిల్లీ: పీఎఫ్ ఖాతాదారులకు మరోసారి కొవిడ్ అడ్వాన్స్ తీసుకునే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కల్పిస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పీఎఫ్ ఖాతాదారులు నాన్ రీఫండబుల్ కొవిడ్ అడ్వాన్స్ కింద కొంత డబ్బును విత్డ్రా చేసుకోవచ్చునని ఈపీఎఫ్వో స్పష్టం చేసింది. గతేడాది కరోనా తొలి వేవ్ సమయంలో పరిస్థితుల దృష్ట్యా ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద తొలిసారి ఈ అవకాశాన్ని కల్పించిన ఈపీఎఫ్వో.. సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి నాన్ రీఫండబుల్ కొవిడ్ అడ్వాన్స్ ఫెసిలిటీని కల్పిస్తోంది. దీని ప్రకారం.. పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లో నుంచి 75 శాతం మొత్తాన్ని ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు లేదా మూడు నెలల బేసిక్ వేజెస్, డియర్నెస్ అలోవెన్సెస్ (డీఏ) మొత్తాన్ని తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. రూల్స్ ప్రకారం అవసరం మేరకు మరింత తక్కువ మొత్తాన్ని కూడా ఖాతాదారులు తీసుకోవచ్చు.
