
చంద్రబాబుకి సీఐడీ మరో షాక్ ఇచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ నమోదైంది. ఫైబర్ నెట్ కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్ట్ ఇచ్చారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని విచారించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కొంతమంది బెయిల్ పై ఉన్నారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు. నిందితుల జాబితాలో లోకేష్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు అవకతవకలకు పాల్పడ్డారని పీటీ వారెంట్ పెండింగ్ లో ఉంది.
ఫైబర్ నెట్ కేసులో రూ.115 కోట్ల నిధులు దారిమళ్లించారని సిట్ దర్యాప్తులో తేలిందని సీఐడీ ఆరోపిస్తోంది. 2019లోనే ఈ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో A1గా వేమూరి హరి ప్రసాద్, A2 మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారని పేర్కొంది. అయితే వేమూరి హరిప్రసాద్ చంద్రాబబుకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. దీంతో ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్రను ఉన్నట్లు సీఐడీ అభియోగిస్తోంది. ఫైబర్ నెట్ కాంట్రాక్టును టెర్రా సాఫ్ట్ అనే సంస్థకు అక్రమ మార్గంలో టెండర్లు కట్టబెట్డారని సీఐడీ ఆరోపిస్తుంది. టెండర్ గడువు వారం రోజులు పొడిగించి ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపింది. ఈ వ్యవహారంలో వేమూరి హరిప్రసాద్ కీలక పాత్ర పోషిచారంటూ ... బ్లాక్ లిస్ట్లో ఉన్న టెర్రా సాఫ్ట్కు టెండర్ దక్కేలా చేశారని సీఐడీ అభియోగించింది. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా రూ. 115 కోట్ల అవినీతిని జరిగిందని సీఐడీ చెబుతోంది.
ఏపీ సివిల్ సప్లైస్కు నాసిరకం ఈ-పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు ప్రభుత్వం టెర్రా సాఫ్ట్ను గతంలో బ్లాక్ లిస్టు పెట్టింది. అనంతరం టెర్రాసాఫ్ట్ను బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే ఈ సంస్థను లిస్ట్ నుంచి తొలగించారు అప్పటి అధికారులు. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో కలిసి టెర్రాసాఫ్ట్ ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ను దక్కించుకుంది. అయితే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీని నిబంధనలకు విరుద్ధంగా టైరాసాఫ్ట్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. రూ.115 కోట్లతో నాసిరకం మెటీరియల్ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్కు సరఫరా చేసినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇదంతా చంద్రబాబు సూచనల మేరకే జరిగిందని సీఐడీ ఆరోపిస్తుంది.