పబ్‌జి ఆడి.. గుండె పోటుతో కుప్పకూలిన 16 ఏళ్ల విద్యార్థి

పబ్‌జి ఆడి.. గుండె పోటుతో కుప్పకూలిన 16 ఏళ్ల విద్యార్థి

తిండిమీద ధ్యాస ఉండదు. ఎంత వద్దన్నా తల్లిదండ్రుల మాట పట్టించుకోరు. పనికిరాని పబ్ జి గేమ్ కు అలవాటై మంచి భవిష్యత్తుపు పాడు చేసుకుంటున్నారు పిల్లలు. ఈ గేమ్ కు అలవాటైన 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పబ్‌జి గేమ్‌ను ఏకధాటిగా 6 గంటలపాటు ఆడటం వల్ల బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరణించిన అబ్బాయి పేరు ఫర్ఖాన్ ఖురేషి. ఇతనిది మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ పట్టణం. 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఈ నెల 26వ తేదీన మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో భోజ‌నం చేసి ప‌బ్‌జి ఆట‌లో మునిగిపోయాడు. సాయంత్రం 7 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని తెలిపారు డాక్టర్లు. ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో తీవ్రమైన భావావేశాల‌కు లోనుకావ‌ల్సి వ‌స్తుంది. గేమ్‌లో ఓట‌మికి త‌ట్టుకోలేక ఖురేషీ మృతి చెందినట్లు తెలుస్తోంది.

పబ్‌జి గేమ్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది గేమ్ ప్రియులకు ఊర్రూత్తలూగిస్తోంది. అయితే పబ్‌జి‌పై వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంది. భారత్‌లో మాత్రమే కాకుండా ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలని చాలా దేశాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.