ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు : ‘ప్రజావాణి’ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​మీటింగ్​హాల్లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆయ న హాజరై ఫిర్యాదులను స్వీకరించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్ లైన్ లో అప్​లోడ్​చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  ఆయా సమస్యలపై మొత్తం 73 ఫిర్యాదులు  వచ్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు. అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, డీఆర్డీవో చందర్, జడ్పీ సీఈవో గోవింద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్పెషల్​ఆఫీసర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి

క్రీడా ప్రాంగణాలు, మన ఊరు -మన బడి, హరిత హారం, మెగా పల్లె ప్రకృతి వనాల పురోగతి పనులను నిశితంగా పరిశీలించేందుకు మండల స్పెషల్​ఆఫీసర్లు మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి రిపోర్టు ఇవ్వాలని  కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. ప్రతి పంచాయతీ పరిధిలో ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ పక్కాగా చేపట్టాలన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేసే పంచాయతీ సెక్రటరీలను ఉపేక్షించబోమని కలెక్టర్​హెచ్చరించారు.  కాగా వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండడంతో టెన్త్​, ఇంటర్​స్టూడెంట్లకు సంక్రాంతి తర్వాత స్పెషల్​క్లాసులు నిర్వహించేందుకు ప్లాన్​చేయాలని డీఈవో దుర్గాప్రసాద్ ను ఆదేశించారు. 

రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది

కామారెడ్డి, వెలుగు: రాష్ర్టంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, ఈ పాలనకు విముక్తి  కాంగ్రెస్​పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ సీనియర్​నేత షబ్బీర్​అలీ పేర్కొన్నారు.  సోమవారం  కామారెడ్డి జిల్లా ముఖ్య నేతల మీటింగ్​ జరిగింది. హాజరైన షబ్బీర్​అలీ మాట్లాడుతూ..  బీఆర్ఎస్​, బీజేపీలతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదీ ఏమీ లేదన్నారు. 8 ఏండ్లుగా రాష్ర్టంలో బీఆర్​ఎస్​ పార్టీ చేస్తున్న మోసాన్ని  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్​ శ్రేణులు కృషి చేయాలన్నారు.  జిల్లాలో చేపట్టాల్సిన  ‘హాత్​ సే హాత్​ జోడో  అభియాన్’​ కార్యక్రమంపై లీడర్లకు  దిశా నిర్ధేశం చేశారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు,  మాజీ ఎమ్మెల్యే ఎస్​. గంగారాం, లీడర్లు వడ్డేపల్లి సుభాష్​రెడ్డి, విఠల్​రెడ్డి, మోహన్​రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.  

శివాజీ విగ్రహం ప్రారంభించరా?

బోధన్, వెలుగు: బోధన్​ పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని చెప్పి 9 నెలలు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుంట లేరని బీజేపీ లీడర్లు సోమవారం ఆర్డీవో ఆఫీస్​ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవో రాజేశ్వర్​కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ..  అంబేద్కర్​ చౌరస్తాలో విగ్రహ ప్రారంభాన్ని  ఒక వర్గం వారు అడ్డుకున్నారని వాయిదా వేశారని, అనంతరం మున్సిపాలిటీలో తీర్మానం చేసినా.. ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పదిరోజుల్లో శివాజీ విగ్రహం ప్రారంభించకపోతే తామే ప్రారంభించుకుంటామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా  కార్యదర్శి సుధాకర్​చారి, లీడర్లు బాల్​రాజ్, మేక విజయ సంతోష్​, రజనీ కిషోర్, రామరాజులు, బొడ్డు రవి, ధర్మన్న తదితరులు పాల్గొన్నారు. 

అక్రమాలపై విచారణ జరిపించాలి

ఆర్మూర్, వెలుగు : మున్సిపాలిటీ పరిధిలో జరుగు తున్న అవినీతి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ లీడర్లు డిమాండ్​చేశారు. సోమవారం  ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్  ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, టౌన్ ప్రెసిడెంట్​అనిల్ మాట్లాడుతూ.. యానంగుట్ట దగ్గర కరీం అనే వ్యక్తికి కేటాయించిన అసైన్డ్ భూమిలో అక్రమ లేఔట్లు వెలిశాయని, కోర్టులో కేసు ఉండగా వెంచర్ కు ఎలా  పర్మిషన్​ఇచ్చారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలోని ప్రభుత్వ, నాన్ లే అవుట్ స్థలాల్లో, కోర్టు కేసు ఉన్న స్థలాల్లో  ఏ అధికారంతో ఇంటి నంబర్లు కేటాయించారో కలెక్టర్​ చెప్పాలని డిమాండ్​చేశారు.  ఎమ్మెల్యే, కలెక్టర్ ఒక్కటై అవినీతికి తెరలేపుతున్నారని ఆరోపించారు. ఇరిగేషన్  డీఈ రమణారావు సూసైడ్​వెనుక​ అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు.  లీడర్లు ద్యాగ ఉదయ్, పల్లె శ్రీనివాస్, ధోండి  ప్రకాశ్, కలిగోట ప్రశాంత్ పాల్గొన్నారు. 

దారితప్పి జనావాసాల్లోకి జింకపిల్ల..

ఫారెస్ట్​ ఆఫీసర్లకు అప్పగించిన గ్రామస్తులు

పిట్లం, వెలుగు: దారి తప్పి పిట్లం గ్రామంలోకి వచ్చిన జింక పిల్లను స్థానికులు పట్టుకుని ఫారెస్ట్​డిఫ్యూటీ రేంజ్​ఆఫీసర్​రఘుపతికి అప్పగించారు. సోమవారం పిట్లం లోని నేతాజీ నగర్​లో  జింక పిల్లను కుక్కలు తరుముతుండడం గమనించిన స్థానిక యువకుడు వాసరి రమేశ్ కుక్కల నుంచి కాపాడాడు. అనంతరం స్థానికుల సాయంతో వెటర్నరీ హాస్పిటల్​కు తరలించారు.  జింకపిల్లకు గాయాలు మానే వరకు సంరక్షించి అనంతరం స్థానిక అటవీ ప్రాంతంలో వదిలేస్తామని రఘుపతి తెలిపారు. కుక్కల దాడి నుంచి కాపాడిన యువకుడిని ఆయన అభినందించారు.