ప్రాధాన్యతలకే ప్రజాధనం వెచ్చించాలి

ప్రాధాన్యతలకే  ప్రజాధనం వెచ్చించాలి

ఏ కంపెనీ అయినా, బాగా వృద్ధి చెందాలంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మారుతున్న కాలానికి అనుగుణంగా, కొత్త ఆలోచనలు, నూతన టెక్నాలజీతో ఉత్పత్తులను అభివృద్ధి చేయాలి. ఇందుకోసం పెట్టుబడులకు బ్యాంకుల నుండి అప్పులు తీసుకోవడం సహజం. అయితే యాజమాన్యాల తప్పుడు అంచనాలు, నిర్ణయాలు, అప్పుల వినియోగంలో లోపాల వలన కొన్ని పరిస్థితులు అనుకూలించకపోతే, అప్పులు భారంగా మారతాయి. కానీ బాధ్యతగల యాజమాన్యం అప్పుల నుంచి బయటపడేందుకు మంచి వ్యూహాలతో ముందడుగు వేస్తారు . 

అప్పులు వ్యక్తిగతంగా అయినా, సంస్థలు అయినా ప్రభుత్వాలు అయినా తాత్కాలిక అవసరాలకు కోసం తీసుకుంటారు. అప్పులు  సంక్షేమం, అభివృద్ధి కోసం వాడితే బాగుంటుంది. అయితే వాటిని దుర్వినియోగం చేస్తే అవి రాబోయే తరాల భవిష్యత్తును బంధించే విధంగా ఉంటాయి. అప్పులను తీర్చలేక ఆస్తుల అమ్మకం, కార్యకలాపాల మూసివేత జరుగుతుంది. ఈ నిజాన్ని ప్రభుత్వాలను నడిపే నాయకులు తెలుసుకోవాలి.  
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని  అందరికీ తెలిసిన వాస్తవం. గత బీఆర్ యస్ ప్రభుత్వం  తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం  భారీగా అప్పులు చేసింది. ఆ అప్పు వినియోగ విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం వలన తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని  ఆ పార్టీ అధికారం కోల్పోయింది. 

వాటిని ఎత్తి చూపిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల ప్రతిఫలాలు అందక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో ప్రస్తుత  రేవంత్ రెడ్డి ప్రభుత్వం సతమతం అవుతోంది. ఈ గడ్డు ఆర్థిక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు  కోసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ   చక్కదిద్దే ప్రయత్నం చేయడం  ఒక బాధ్యతగా స్వీకరించాలి.

హామీల బరువు

ఎన్‌‌‌‌డిఎ కూటమి భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్, అప్పుల భారాన్ని ఎదుర్కొంటున్నా, కేంద్ర సహకారం వల్ల కొంత ఉపశమనం పొందే అవకాశముంది.ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చులను తగ్గించి అప్పులను తీర్చే ప్రయత్నం చేయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చింది. వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి .  

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం కష్టమని మొన్నటివరకు అధికారంలో ఉన్న  బీఆర్ యస్ కు తెలుసు, కానీ ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  సంక్షేమ పథకాల కోసం, బకాయిల చెల్లింపులతో పాటు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ,  అప్పుల మిత్తి చెల్లింపులు చేయడం కొనసాగుతున్నాయి.  గత ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టర్ల పనుల బిల్లులు బకాయిలు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సొమ్ము వంటి బకాయిలు చెల్లింపులపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. 

గత ప్రభుత్వ బకాయిలు తీర్చేదెలా?

ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం గత ప్రభుత్వం గుత్తేదారులకు, విద్యుత్ శాఖకు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిపి చెల్లించాల్సిన బకాయిలు  సుమారుగా రూ. లక్ష కోట్లు  తక్షణ అవసరంగా ఉన్నాయి. లక్ష కోట్లు చెల్లించాల్సిన సొమ్ము పై  లక్షలాది కుటుంబాల జీవనాధారం నిలిచిపోయిందన్నది వాస్తవం.

 వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న నిర్మాణ రంగానికి సంబంధించిన చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు, పెద్ద సంస్థల వరకూ అందరూ అప్పులు తీసుకుని  పెట్టుబడి పెట్టి ప్రజా పనులు పూర్తి చేసి, ప్రజలకు ఆ పనులను వినియోగంలోకి తెచ్చి ఇప్పుడు బిల్లుల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. మళ్లీ ప్రభుత్వ పని అంటే భయపడేలా చేశారు. 

కనీసం వారిపై కనికరం చూపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందాల్సిన జీవిత భద్రత సొమ్ముల కోసం నెలల నుండి ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు కూడా రాబోయే కాలంలో మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని ఆందోళన చెందే పరిస్థితి ఉంది .  

11 ఏండ్ల ఉచితాల భారం!

 ప్రయోజనం లేని, ప్రాధాన్యత లేని , రిటర్న్స్ లేని పథకాలపై ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. పన్నుల రూపంలో ప్రజల నుండి వచ్చిన డబ్బును తిరిగి ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కల్పించేందుకు కాకుండా, ఏ అవసరాలపై ఖర్చు చేయాలో తెలియక కొన్ని శాఖల ఉద్యోగులు ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. సంక్షేమం వదిలేసి, చేస్తున్న ఉచితాల దుబారాతోనే  గత 11 ఏండ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించిపోయింది.

పారదర్శకత అవసరం!

ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం అమ్మి ఇప్పటికీ సగం మంది ప్రజలను తాగుడుకు బానిసలుగా మార్చారు . ఇది మన రాజ్యాంగానికి విరుద్ధం, ఆర్టికల్ 47 ప్రకారం, ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఒక ప్రధాన బాధ్యత. ప్రభుత్వాలకు తమ అవసరాల కోసం అప్పు చేసే హక్కు ఉన్నది . దాన్ని ఖర్చు చేయడంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి అవసరం. ఈ తరం యువత , ఉద్యోగులు , వ్యాపారవేత్తలు సమర్థవంతమైన పాలన కోరుకుంటున్నారు.

 ప్రజలు చెల్లిస్తున్న పన్నులు ప్రభుత్వాలు ఏలా వాడుతున్నారో, అప్పులు దేనికోసం ఎందుకు తీసుకుంటున్నారో, ఖర్చులపై ప్రజలకు పూర్తి నివేదిక ఇవ్వాలి. నిజమైన ప్రాధాన్యతల కోసమే ప్రజాధనాన్ని వినియోగించాలి. రాజ్యాంగం మనకు కల్పించిన సమాచార హక్కు చట్టం ద్వారా ఇటువంటి ప్రశ్నలు వేయకపోతే, రేపటి తరాలు మనలను క్షమించకపోవచ్చు.

-–సోమ శ్రీనివాస్​ రెడ్డి, సెక్రటరి, ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​-