ముంబై: పుణెలో గత నెల 19న పోర్షె కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు ఇంజినీర్ల మృతికి కారణమైన కేసులో టీనేజర్ ను రిమాండ్ నుంచి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో టీనేజర్ ను అబ్జర్వేషన్ హోమ్కు తరలించాలని జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) ఆదేశించడం చట్టవిరుద్ధమని, న్యాయపరిధిని సమీక్షించకుండానే జేజేబీ ఆదేశాలు జారీ చేసిందని జస్టిస్ భారతి ఢాంగ్రే, జస్టిస్ మంజూషా దేశ్ పాండేతో కూడిన బెంచ్ పేర్కొంది. ‘‘మేము (బెంచ్) చట్టానికి, జువెనైల్ జస్టిస్ యాక్ట్ లక్ష్యాలు, ఉద్దేశాలకు కట్టుబడి ఉన్నాం.
యాక్సిడెంట్ కేసు సీరియస్ నేరమే అయినా మైనర్ కాబట్టి పెద్దవారికి భిన్నంగా చూడాలి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత గంటల వ్యవధిలోనే బెయిల్ ఇవ్వడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో బెయిల్ క్యాన్సిల్ చేసి మైనర్ను అబ్జర్వేషన్ హోమ్కు తరలించాలని జేజేబీ ఆదేశాలు జారీచేసిందని హైకోర్టు పేర్కొంది. మైనర్ వయసును పరిగణలోకి తీసుకోకుండా జేజేబీ ఆదేశాలు జారీ చేసిందని, ప్రస్తుతం అబ్జర్వేషన్ హోమ్లో ఉన్న మైనర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈమేరకు మైనర్ అత్త వేసిన పిల్ను విచారించిన హైకోర్టు.. మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
