పంజాబ్​ను డ్రగ్స్​ సమస్య వీడలే : రాహుల్​ గాంధీ

పంజాబ్​ను డ్రగ్స్​ సమస్య వీడలే : రాహుల్​ గాంధీ
  •     రోజురోజుకూ ఈ ప్రాబ్లమ్​ పెరుగుతోంది 
  •     కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్
  •     లూథియానాలో ఎన్నికల ప్రచారం

చండీగఢ్​:  పంజాబ్​లో డ్రగ్స్​ సమస్య ఇంకా ఉన్నదని కాంగ్రెస్​ మాజీ చీఫ్ ​రాహుల్​ గాంధీ అన్నారు. ఈ ప్రాబ్లమ్​ పెరుగుతోందని, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పంజాబ్​లోని లూథియానా ఎంపీ అభ్యర్థి అమరీందర్​సింగ్​ రాజా వారింగ్​ తరఫున డాఖాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్​ గాంధీ మాట్లాడుతూ..

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పెట్టిన మహాలక్ష్మి స్కీం, రైతులకు రుణమాఫీ, కనీస మద్దతు ధరలాంటి హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. డ్రగ్స్​ సమస్యపై పంజాబ్​ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆప్​, కాంగ్రెస్​ ఇండియా కూటమిలోనే ఉన్నా.. పంజాబ్​ లోక్​సభ ఎన్నికల్లో మాత్రం ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.  

రాజ్యాంగం అనేది పేదల గొంతుక

 రాజ్యాంగం అనేది ఓ పుస్తకం కాదని, ఇది పేదల గొంతుక అని రాహుల్​గాంధీ తెలిపారు. ఇప్పటివరకూ దేశ చరిత్రలోనే ఏ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదంటూ బీజేపీపై పరోక్షంగా ధ్వజమెత్తారు. “రిజర్వేషన్​ అయినా.. ప్రభుత్వ ఉద్యోగమైనా.. పేదలకు హక్కులైనా అవి రాజ్యాంగం కల్పించినవే. ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఫినిష్​ చేయాలనుకుంటున్నది” అని ఆరోపించారు.

ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని ప్రధాని మోదీ మాట తప్పారని ధ్వజమెత్తారు. అదానీ, అంబానీకి లాభం చేకూర్చేందుకు నోట్ల రద్దు, జీఎస్టీతో చిన్న, చిన్నమధ్యతరగతి వ్యాపారులను కష్టాల్లోకి నెట్టారని అన్నారు. అగ్నివీర్​​ స్కీమ్​తో దేశ జవాన్లను కూడా అవమానించారని ఫైర్​ అయ్యారు. జూన్​ 4 తర్వాత తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు అగ్నివీర్​ స్కీమ్​ను డస్ట్​బిన్​లో పడేస్తామని చెప్పారు.

కాంగ్రెస్‌‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రూ.70 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిందని గుర్తుచేశారు. ఈ సారికూడా ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రుణమాఫీకి మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే క్రాప్​ ఇన్సూరెన్స్​ స్కీమ్​ తీసుకొస్తామని, ప్రస్తుత స్కీమ్​ 16 ఇన్సూరెన్స్​ కంపెనీలకు మాత్రమే మేలు చేస్తోంది తప్ప రైతులకు కాదని అన్నారు. అన్నదాతలు దేశానికి వెన్నెముక 
అని, వారిని కాపాడుకోవాలని అన్నారు.