చండీగఢ్: ‘ఓటీపీ, పిన్ ఎవరికీ చెప్పొద్దు. బ్యాంకు వాళ్లు అడిగినా సరే’ అంటూ బ్యాంకులు పదే పదే చెబుతున్నా అలాగే మోసపోతున్నారు చాలా మంది. మామూలు జనమే కాదు, ఆ జనం ఎన్నుకున్న నేతలూ బుక్కవుతున్నారు. అందుకు ఉదాహరణ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య, పటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్. జార్ఖండ్కు చెందిన ఓ సైబర్ కేటుగాడు బ్యాంక్ మేనేజర్నంటూ ఫోన్ చేసి ఆమె అకౌంట్ నుంచి ₹23 లక్షలు కొట్టేశాడు. జార్ఖండ్లోని జామ్తారా ప్రాంతం సైబర్ నేరాలకు హబ్. అక్కడి నుంచే వారం క్రితం అతుల్ అన్సారీ అనే వ్యక్తి, పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ప్రణీత్కు ఫోన్ చేశాడు. ఎస్బీఐ మేనేజర్నని నమ్మించాడు. అకౌంట్లో జీతం పడాల్సి ఉందని, ఏటీఎం పిన్, ఓటీపీ చెప్పాలని కోరాడు. ఎదురు కూడా ప్రశ్నించకుండా ఆమె వివరాలు చెప్పారు. తర్వాత 3 విడతల్లో అతగాడు ఆమె ఖాతా నుంచి ₹23 లక్షలు డ్రా చేశాడు. దీంతో వెంటనే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మంగళవారం అన్సారీని అరెస్ట్ చేశారు.