- ఆరు వరుస పరాజయాలకు చెక్
- ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
- రాణించిన ప్రభ్సిమ్రన్ సింగ్
- ఇంగ్లిస్, కనోలి శ్రమ వృథా
లక్నో: ఐపీఎల్–19 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ చెలరేగింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (51 బాల్స్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 101 నాటౌట్), ప్రభ్సిమ్రన్ సింగ్ (39 బాల్స్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 69) దంచికొట్టడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్జెయింట్స్పై నెగ్గింది. ఫలితంగా ఆరు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. టాస్ ఓడిన లక్నో 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసింది. జోస్ ఇంగ్లిస్ (44 బాల్స్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 72), ఆయుష్ బదోనీ (18 బాల్స్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 43), అబ్దుల్ సమద్ (20 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్) రాణించారు. తర్వాత పంజాబ్ 18 ఓవర్లలో 200/3 స్కోరు చేసింది. శ్రేయస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇంగ్లిస్ మెరుపులు.. బదోని దూకుడు
మొదట బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్లు తగిలాయి. ఓ ఎండ్లో ఇంగ్లిస్ నిలకడగా ఆడినా.. మూడు ఓవర్లు కూడా ముగియకముందే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (0), వన్డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ (2) త్వరగానే అవుట్ కావడంతో లక్నో 20/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన బదోనీ మెరుగ్గా ఆడాడు. ఎదుర్కొన్న ప్రతి బాల్ను బౌండ్రీ దాటించే ప్రయత్నం చేశాడు. దాంతో లక్నో 66/2 స్కోరుతో పవర్ప్లేను ముగించింది.
అయితే చహల్ (2/25) వేసిన ఏడో ఓవర్లో ప్రభ్సిమ్రన్.. బదోనీని స్టంపింగ్ చేయడంతో మూడో వికెట్కు 49 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఓవైపు వికెట్లు పడినా.. రెండో ఎండ్లో ఇంగ్లిష్ దంచికొట్టాడు. అర్ష్దీప్ను టార్గెట్ చేసి 6 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టాడు. ఈ క్రమంలో 28 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అవతలి వైపు రిషబ్ పంత్ (26) సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేయడంతో పది ఓవర్లలో స్కోరు 100/3కి పెరిగింది.
18 రన్స్ వద్ద పంత్ క్యాచ్ను శ్రేయస్ వదిలేశాడు. కానీ 14వ ఓవర్లో చహల్ దెబ్బకు పంత్ వెనుదిరగడంతో.. నాలుగో వికెట్కు 65 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. చివర్లో అబ్దుల్ సమద్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. ఐదో వికెట్కు 35 రన్స్ జత చేసి ఇంగ్లిస్ ఔటైనా సమద్ భారీ హిట్టింగ్ చేశాడు. ముకుల్ చౌదరీ (1) నిరాశపర్చినా.. తొలి మ్యాచ్ ఆడిన అర్జున్ టెండూల్కర్ (5 నాటౌట్) ఎదుర్కొన్న ప్రతి బాల్కు రన్ చేశాడు. యాన్సెన్ రెండు వికెట్లు తీశాడు.
140 రన్స్ భాగస్వామ్యం..
ఛేదనలో పంజాబ్ను ఆరంభంలోనే షమీ (2/45) దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బాల్కు ప్రియాన్షు ఆర్యా (0) డకౌట్ చేసిన అతను తన తర్వాతి ఓవర్లో కూపర్ కనోలి (18)ని పెవిలియన్కు పంపాడు. 22/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్ను ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నారు. సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టారు. దాంతో 65/2తో పవర్ప్లేను ముగించిన ఈ ఇద్దరు 9.3 ఓవర్లలోనే స్కోరు వందకు చేర్చారు.
తర్వాత కూడా అదే జోరును కొనసాగించారు. ఈ క్రమంలో ప్రభ్ 28, శ్రేయస్ 33 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశారు. అయితే దూకుడుగా ఆడుతున్న ఈ జోడీకి 15వ ఓవర్లో అర్జున్ టెండూల్కర్ (1/36) బ్రేక్ వేశాడు. ప్రభ్సిమ్రన్ను ఎల్బీ చేసి మూడో వికెట్కు 140 రన్స్ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. చేయాల్సిన రన్రేట్ తక్కువగా ఉండటంతో శ్రేయస్ భారీ షాట్లకు తెరలేపాడు. షమీ వేసిన 16వ ఓవర్లో మూడు సిక్స్లతో రెచ్చిపోయాడు. సుయాన్ష్ షెడ్జే (9 నాటౌట్) ఫోర్ కొట్టగా, శ్రేయస్ సిక్స్తో 51 బాల్స్లో సెంచరీ పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 196/6 (ఇంగ్లిస్ 72, బదోనీ 43, చహల్ 2/25). పంజాబ్: 18 ఓవర్లలో 200/3 (శ్రేయస్ 101, ప్రభ్సిమ్రన్ 69, షమీ 2/45)
నాలుగో బెర్త్ ఎవరిదో?
నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇప్పుడు మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పంజాబ్ 15 పాయింట్లతో నాలుగో ప్లేస్లో ఉన్నా.. నేడు జరిగే రెండు మ్యాచ్ల ఫలితాలపైనే చివరి బెర్త్ ఆధారపడి ఉంది. రాజస్తాన్.. ముంబైపై గెలిస్తే 16 పాయింట్లతో డైరెక్ట్గా నాకౌట్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే టైమ్లో కోల్కతా ఢిల్లీపై నెగ్గితే 15 పాయింట్లతో పంజాబ్తో సమంగా నిలుస్తుంది. అప్పుడు నెట్ రన్రేట్కీలకమవుతుంది.
