
- ప్రతి గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించాలి
- పలు చోట్ల జోరుగా విత్తనాల పంపిణీ
నస్పూర్, వెలుగు: నాణ్యమైన విత్తనంతో వ్యవసాయంలో లాభాలు గడించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంచిర్యాలలో ‘నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం’ కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్, నోడల్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రావు మాట్లాడుతూ..
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ‘నాణ్యమైన విత్తనం -రైతన్నకు నేస్తం’ నినాదంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు. విత్తన ఉత్పత్తిపై ఎంపిక చేసిన రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తారని, తద్వారా రానున్న రెండు మూడేండ్లలో ప్రతి గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు అనిత, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు, మండల వ్యవసాయ అధికారులు మహేందర్, కృష్ణ, రజిత, రైతులు పాల్గొన్నారు.
తోటి రైతులకు తక్కువ ధరకే అందజేయాలి
బెల్లంపల్లి రూరల్, వెలుగు: రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే గడ్డం వినోద్అన్నారు. భీమిని, నెన్నెల రైతు వేదికల వద్ద రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ అభ్యుదయ రైతులకు వరి, కంది , పెసర, మినుము, జొన్న నాణ్యమైన విత్తనాల కిట్లను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ విత్తనాలను సాగు చేసి ఉత్పత్తి అయిన విత్తనాలను తోటి రైతులకు తక్కువ ధరకే అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారిణి కల్పన, భీమిని డివిజన్ఏడీఏ సురేఖ, ఏవో సృజన, బెల్లంపల్లి కృషి విజ్ఞాన శాస్త్రవేత్త నాగరాజు, ఏఈవోలు, కాంగ్రెస్నేతలు పాల్గొన్నారు.
విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
నిర్మల్, వెలుగు: సాగు సీజన్ మొదలైన నేపథ్యంలో రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నిర్మల్ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రూరల్ మండలం చిట్యాలలో విత్తనాలు పంపిణీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు రావుల రామనాథ్, మెడిసమ్మె రాజు, సర్కిల గంగన్న తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనంతోనే రైతుకు లాభాలు
కాగజ్ నగర్, వెలుగు: నాణ్యమైన విత్తనాలు వేయడంతోనే రైతులకు పంట దిగుబడి వచ్చి లాభాలు సాధ్యమని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ అన్నారు. నాణ్యమైన విత్తనం -రైతన్నకు నేస్తంలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలోని పది మంది రైతులకు వరి, కంది, పెసర విత్తనాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, ఎమ్మెల్యే హరీశ్ బాబుతో కలిసి రైతులకు అందించారు. కేవీకే శాస్త్రవేత్తలు తిరుపతి, కాగజ్ నగర్ ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ పాల్గొన్నారు.