- ఏజెన్సీ గిరిజనుల తిప్పలు
- వెంటాడుతున్న మలేరియా, డెంగీ భయం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:ఏజెన్సీలో వైద్యం మేడి పండు చందంగా మారింది. జిల్లాలోని పీహెచ్సీల్లో పూర్తి స్థాయిలో డాక్టర్లు లేకపోవడంతో క్వాలిటీ ట్రీట్మెంట్ అందడం లేదు. జిల్లాలోని 29పీహెచ్సీల్లో 65 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా,41 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో 22 మంది కాంట్రాక్ట్ డాక్టర్లే కావడం గమనార్హం. ఒక్కో పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లకు గానూ పలు పీహెచ్సీల్లో ఒక్కరే ఉన్నారు.
మలేరియా, డెంగీ భయం
గ్రామాల్లో మలేరియా, అర్బన్ ఏరియాల్లో డెంగీ భయం ప్రజలను వెంటాడుతోంది. వర్షాలు ప్రారంభమైన క్రమంలో దోమలు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రోగాలు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏజెన్సీలో పీహెచ్సీలే వైద్య సేవల్లో కీలకం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పీహెచ్సీలను డాక్టర్ల కొరత వెంటాడుతోంది. జిల్లాలో 29 పీహెచ్సీలుండగా, ప్రతీ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లుండాలి. వీటిలో 12 పీహెచ్సీలు 24 గంటలు పని చేసేవి ఉన్నాయి. డాక్టర్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో 24 గంటల పీహెచ్సీలు అలంకార ప్రాయంగానే మారాయి. ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్సీల్లో పూర్తి స్థాయిలో డాక్టర్లు లేకపోవడంతో రోగులు ట్రీట్మెంట్ కోసం ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోంది. స్తున్నారు. వారు కమీషన్ల కోసం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకేంద్రాల్లోని ప్రైవేట్ హాస్పిటల్స్కు ట్రీట్మెంట్ వారిని పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదైనా గ్రామంలో హెల్త్ క్యాంప్ పెడితే రోగులకు నర్సులే ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. డాక్టర్ సెలవుపై వెళ్తే నర్సులే వైద్యం అందిస్తున్నారు. పీహెచ్సీలలో బయోమెట్రిక్ సిస్టం అమలులో లేకపోవడంతో వైద్యులు ఇష్టమైనప్పుడు హాస్పిటల్కు వచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 2020లో 594 మలేరియా, 604 డెంగీ కేసులు, 2021లో 353 మలేరియా, 381 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 108 మలేరియా కేసులు, 26 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు మొదలు కాకముందే వందకు పైగా మలేరియా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు 26 డెంగీ కేసులు నమోదైతే 20 కేసులు కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీల పరిధిలోనే ఉండడం గమనార్హం. గ్రామాల్లో మలేరియా కేసులు, అర్బన్ ఏరియాలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై వైద్య శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తాం
పీహెచ్సీల్లో డాక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రతీ పీహెచ్సీకి ఒక డాక్టర్ ఉండేలా చర్యలు తీసుకున్నాం. మలేరియా, డెంగీ నివారణపై ఇప్పటికే డాక్టర్లు, వైద్య సిబ్బందితో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. 279 గ్రామాల్లో మలేరియా నివారణకు చర్యలు చేపడతాం. డెంగీ కేసులు నమోదవుతున్న దృష్ట్యా మున్సిపల్ ఆఫీసర్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలి.
–డాక్టర్ దయానందస్వామి, డీఎంహెచ్వో